శ్రీశైలం: కొన్ని సంవత్సరాల తర్వాత జలకళ సంతరించుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిగా నిండడంతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ శుక్రవారం నాలుగు గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మరో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.
కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి కొద్ది రోజులుగా వరద పోటెత్తుతోంది. జూరాల జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీటిప్రవాహాలు ఉన్నాయి. దానితో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది.
మంత్రి అనిల్ కుమార్ మొదట కృష్ణానదికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నాలుగు గేట్లు ఎత్తి 1.06 లక్ష క్యూసెక్కుల ప్రవాహాన్ని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. మొదట ఆరవ నెంబర్ గేటు ఎత్తారు. ఆ తర్వాత 7, 8, 9 గేట్లను ఎత్తారు. ఒక్కో స్లూయిజ్ నుంచి 25వేల క్యూసెక్కుల చొప్పన నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.
గేట్లు తెరుచుకోవడంతో పరవళ్లు తొక్కే ప్రవాహాన్ని చూసేందుకు శ్రీశైలం ప్రాజెక్టుకు రేపటి నుంచి పర్యాటకుల తాకిడి పెరగే అవకాశం ఉంది. వచ్చేది శని ఆదివారాలు కావడంతో కృష్ణమ్మ పరవళ్లను కళ్లారా చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తారని ఆశిస్తున్నారు.