న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఒక సినిమాను విడుదల అయిన మరుసటి రోజున ధియేటర్ల నుంచి ఉపసంహరింపజేసిన మమతా బెనర్జీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది.
భోబిష్యూతర్ భూత్ అనే ఈ సినిమా ఫిబ్రవరి 16న విడుదల అయింది. ఆ మరుసటి రోజునే ప్రజల మనో భావాలను దెబ్బతీస్తుందన్న కారణంతో దాదాపు అన్ని ధియేటర్ల నుంచీ దానిని ఉపసంహరింపజేశారు. ఈ చర్య మమతపై విమర్శలకు దారి తీసింది. పద్మావత్ సినిమా వివాదం తలెత్తినపుడు భావప్రకటన స్వేచ్ఛ పక్షాన నిలిచిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈ వ్యంగ్యచిత్రాన్ని నిషేధించారని బిజెపి వ్యాఖ్యానించింది.
జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈ కేసులో తీర్పు చెబుతూ, మూక వచ్చి ఏదో చేస్తుందన్న భయంతో భావప్రకటన స్వేచ్ఛను బలి చేయలేమని వ్యాఖ్యానించింది. సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత ఒక సినిమా ప్రదర్శనను ఎవరూ అడ్డుకోలేరని ధర్మాసనం పేర్కొన్నది.