తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ మీద ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి సంచలన ఆరోపణలు చేశారు. పృథ్వీ తిరుమల కొండ మీద ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్లోనే మద్యం తాగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఛానెల్ పనిచేసే ఓ యువతితో పృథ్వి అసభ్యంగా మాట్లాడిన ఆడియో టేపులను కందారపు మురళి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఓ కామాంధుడు ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ కావడం దారుణం. అతన్ని వెంటనే చైర్మన్ బాధ్యతల నుంచి తొలగించాలి. నటుడు పృథ్వీ ఉద్యోగులను బూతులు తిట్టడం, ఉద్యోగినులను లైంగికంగా వేధిస్తున్నారు. సినిమాల్లో హాస్యం పండించే ఆయన ఇక్కడ శృంగారం ఒలకబోస్తున్నారు. టీటీడీకి చెందిన ఎస్వీబీసీలో ఇక వెంకటేశ్వర స్వామి వైభవం చూపుతారా… లేక పృథ్వీరాజ్ లీలలు చూపుతారో చెప్పాలి. ఉద్యోగుల పరిచయ సమయంలో కులం అడిగిన ఘనుడు పృథ్వీ . ఛానెల్ కార్యాలయంలోనే ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిడానికి పృథ్వీ యత్నిస్తున్నారు. 36 ఉద్యోగాలు ఇప్పించి పృథ్వీ లక్షల రూపాయలు దండుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఆయన్ను మందలించారు. చివరకు 30 మందిని తొలగించారు” అని కందారపు మురళి ఆరోపించారు. ప్రభుత్వం పృథ్వీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్వీబీసీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో పృథ్వీరాజ్ రొమాంటిక్గా మాట్లాడిన ఆడియో టేప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని సామాజిక మాధ్యమాల్లో ఆ ఆడియో టేప్ వైరల్గా మారింది. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.