అమరావతి: పాలు ఇచ్చే అవును వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం కార్యకర్తల సమావేశంలో ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదనీ, 23 సీట్లు ఇచ్చేంత తప్పు తాను ఏమీ చేయలేదని చంద్రబాబు అన్నారు. తాను చేసిన తప్పులు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టిసీమ నీళ్లు తాగారు కానీ ఓట్లు వేయడం మర్చిపోయారని చంద్రబాబు అన్నారు. పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారని చంద్రబాబు చలోక్తి విసిరారు. మన మీద కోపంతో అమరావతిని చంపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మొదలు పెట్టిన ప్రపంచ స్థాయి రాజధాని నేడు వెలవెల పోతుందని చంద్రబాబు అన్నారు.
టిడిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి శ్రేణులు బెదిరిస్తే టిడిపి కార్యకర్తలు ఊళ్లు వదిలిపోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏదైనా ఊళ్లో టిడిపి కార్యకర్తలకు భద్రత లేదని భావిస్తే తాను ఆ ఊళ్లోనే బస చేస్తాననీ, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాతే తిరిగి వెళతానని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలో ఉండగా ఇలానే చేస్తే వీళ్లెక్కడ ఉండేవారని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసు యంత్రాంగం నిస్పక్షపాతంగా పని చేయాలని చంద్రబాబు సూచించారు. అధికార పార్టీ నేతల ఒతిళ్లకు లొంగి టిడిపి శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.