అమరావతి: పోలింగ్కు ముందు ప్రతిపక్ష వైసిపితో పోరాటం చేసిన టిడిపి పోలింగ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) తీరుపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
సరిగ్గా పోలింగ్కు నాలుగు రోజుల ముందు ఎన్నికల కమిషన్ అప్పటి వరకూ సిఎస్గా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను తొలగించి ఎల్వి సుబ్రమణ్యాన్ని సిఎస్గా నియమించింది. ఆయన నియామకం జరిగినప్పటి నుంచి ఆయన తీరు పలు విమర్శలకు తావిస్తోంది.
తాజాగా ఎల్వి సుబ్రమణ్యం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘చంద్రబాబు ముఖ్యమంత్రే. కానీ ఆయనకి అధికారాలు లేవు. సమీక్షలు నిర్వహించే అధికారం కూడా లేదు’ అని వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారాలు లేవు అని సిఎస్ వ్యాఖ్యానించటంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ చంద్రబాబే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. చంద్రబాబు అధికారాలు లేని ముఖ్యమంత్రి అని సిఎస్ ఎలా అంటారని ఆయన దుయ్యబట్టారు. మీరు రిటైర్డ్ అవ్వకముందే మిమ్మల్ని రిటైర్డ్ సిఎస్ అంటే మీరు ఒప్పుకుంటారా? అని నరేంద్ర ప్రశ్నించారు. ఇలాంటి సిఎస్ను తాము ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. సిఎస్ వ్యవహారం చేస్తుంటే కొత్త పిచ్చోడు పొద్దెరగడు అనే విధంగా ఉందని నరేంద్ర ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారాలు లేవని సిఎస్ అనటం ఎంతవరకూ సమంజసమని టిడిపి ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి సమీక్షలు చేయవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో చేయకూడదా అని ఆయన మండిపడ్డారు.
సిఎస్ సుబ్రమణ్యం ఎన్నికల సంఘం చేతిలో కీలు బొమ్మగా మారాడని టిడిపి అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. సిఎస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనీ, ఒక పార్టీకి మద్దతుగా ఉంటున్నారనీ యామిని దుయ్యబట్టారు. సిఎస్గా ఆయన విధులు సక్రమంగా నిర్వర్తిస్తే మంచిదని యామిని హితవు పలికారు.
ఆర్టికల్ 172 ప్రకారం ముఖ్యమంత్రికి సమీక్ష జరిపే అధికారం ఉందనీ, కానీ సిఎస్ సమీక్ష నిర్వహించేందుకు అధికారాలు లేవు అనటం విడ్డురంగా ఉందనీ టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. సిఎస్ ముఖ్యమంత్రికి జవాబుదారీ అనే విషయం తెలుసా? అని అనురాధ ప్రశ్నించారు.
సిఎస్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారని అనురాధ విమర్శించారు. సిఎస్ మోదికి తొత్తులా మారారని అనురాధ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి అధికారాలు లేవని సిఎస్ సమీక్షలు జరపటం ఎంతవరకూ సమంజసమని అనురాధ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని సిఎస్ను అనురాధ హెచ్చరించారు.
సిఎస్, టిడిపి మధ్య ఇంత వివాదం నడుస్తుంటే వైసిపి మాత్రం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. వాళ్లే గొంతు చించుకుంటున్నారు, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేద్దాం, మన మీద ఇప్పుడు వాళ్ళు దృష్టిపెట్టే అవకాశం లేదు అనే ధోరణిలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.