అమరావతి: బ్యాంకు అప్పులు తీర్చిన తరువాత శ్రీరంగనీతులు చెప్పాలంటూ వైసిపి పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి)కి విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని సూచించారు.
అప్పు తీర్చని కారణంగా పివిపి ఆస్తుల వేలానికి కెనరా బ్యాంకు సిద్ధమయిన నేపథ్యంలో కేశినేని ఆయనపై విమర్శలు సంధించారు.
కొద్ది రోజులుగా పివిపి, కేశినేనిల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ట్వీట్ వార్ కొనసాగుతోంది.
తాజాగా కెనరా బ్యాంక్ సికింద్రాబాద్ శాఖ పివిపి ఆస్తుల వేలానికి నోటీసు జారీ చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
2009లో పివిపి కేపిటల్ సంస్థ పెద్ద మొత్తంలో రుణం తీసుకుని చెల్లించకపోవడంతో బకాయిలు 148.90కోట్ల రూపాయలకు చేరాయి. ఇచ్చిన రుణాన్ని వసూలు చేసేందుకు కెనరా బ్యాంకు యాజమాన్యం చెన్నైలోని పివిపి వెంచర్స్ లిమిటెడ్ ఆస్తుల వేలం వేసేందుకు సిద్ధమైంది.
ఈ సంస్థకు చెన్నై పెరంబూర్ గ్రామంలో ఉన్న సుమారు 24,355,29చదరపు మీటర్ల ఖాళీ భూమిని వేలం వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ప్రకటించారు.
అసలే బ్యాంకుల పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన వేలాది కోట్ల రూపాయలను తిరిగి చెల్లించిన తరువాత శ్రీరంగనీతులు చెప్పమనండి లేకపోతే నిమ్మగడ్డకు పట్టిన గతే పడుతుందని వైసిపి అధినేత సిఎం జగన్మోహనరెడ్డి ఉద్దేశిస్తూ కేశినేని ట్వీట్ చేశారు.