హైదరాబాద్: ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా ఈ నెల 28న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ కానుంది. శుక్రవారం(నవంబర్ 29) కూడా మంత్రివర్గ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలోని ఇతర అంశాలతో పాటు ఆర్టీసీ అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 5న సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు.. 52 రోజుల అనంతరం సమ్మెను ముగిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం నుంచే తాము విధుల్లోకి చేరుతామన్నారు. అయితే ఇందుకు ప్రభుత్వం మాత్రం అనుమతించలేదు. లేబర్ కోర్టు నిర్ణయం తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కొన్ని విధి విధానాలు ఖరారు చేయాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయాలన్న డిమాండ్ ను శాశ్వతంగా వదిలేయాలని, ఆపై నిర్దిష్ట కాలం పాటు మరోసారి సమ్మెకు దిగకుండా సంఘాలు, ఉద్యోగులతో సంతకాలు చేయించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆర్టీసీ సమ్మెపై పలు కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అవి పరిష్కారం అయ్యేంతవరకూ వేచి చూడాలన్న అంశంపైనా చర్చ జరగనుంది. 5,100 ప్రైవేట్ రూట్లకు సంబంధించిన అంశంపైనా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది ? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.