హైదరాబాదు, ఏప్రిల్ 27 : రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నా టిఆర్ఎస్ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రారంభించి నేటికి 18సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పార్టీ ఆవిర్భవ దినోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొని నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ టిఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సిలు, రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా కెసిఆర్ మేనల్లుడు, ఎమ్మెల్యే హరీష్రావు సిద్దిపేటలోని తన స్వగృహంలో పార్టీ నేతల సమక్షంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, సాధించిన విజయాలు తదితర విషయాలను ఈ సందర్భంగా కెటిఆర్ వివరించారు. హరీష్ రావు తన సందేశాన్ని ఇస్తూ ట్విట్టర్ వేదికగా టిఆర్ఎస్ స్థాపించిన నేపథ్యంలో తీసిన ఫోటోను షేర్ చేశారు.
ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సారి కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు దూరంగా ఉన్నకెసిఆర్ ఫిలింనగర్ దైవసన్నిధానంకు వెళుతున్నట్లు సమాచారం. అక్కడికి విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద విచ్చేసినట్లు సమాచారంతో కెసిఆర్ అక్కడకు వెళుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గౌరవ శ్రీ కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్పూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలి. pic.twitter.com/C0DrF17V18
— Harish Rao Thanneeru (@trsharish) April 27, 2019