తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగనున్నట్లు తెలుస్తోంది. కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత కె.కేశవరావు ఆసక్తికర ప్రతిపాదన చేశారు. కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని… ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపదన్నారు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని సూచించారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందని.. 44 శాతం ఫిట్మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని వ్యాఖ్యానించారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేశవరావు విఙ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నానని.. ఇందుకు ఆయనను అభినందిసస్తున్నాని చెప్పారు. ఇక అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజీ క్యారేజీల విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని కోరారు.
మరోవైపు కేశవరావు చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పందించారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనని, చర్చలకు వెళ్లడానికి సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులను గుర్తిస్తామన్న హామీకి సీఎం కేసీఆర్ కట్టుబడాలన్నారు. కేకే చర్చలకు ఆహ్వానిస్తే తాము రావడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కొందరు మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తి చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే తాము పని చేస్తున్నామని చెప్పారు.
ఇదిఇలా ఉంటే.. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు పది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందంటూ ఆవేదన చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు కార్మికుల ఆత్మహత్యతో సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా విపక్షాలు రోడ్డెక్కాయి. ఇక సోమవారం ఆర్టీసీ జేఏసీ నాయకులు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను కలిశారు. ఆర్టీసీ సమ్మె, అనంతరం నెలకొన్న పరిణామాలను గవర్నర్కు వివరించారు. ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు.