తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి విఐపిల కంటే సాధారణ భక్తులకే అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ప్రమాణ స్వీకారంరోజే ప్రకటించిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆ దిశగా కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు అరగంటలో ఉచిత దర్శనం చేయించనున్నట్లు తెలిపారు. దీని కోసం రోజు రెండు సమయాలను కేటాయించామని వైవి వెల్లడించారు. ఉదయం పది గంటలకు, సాయంత్రం మూడు గంటలకు 60 సంవత్సరాల పైబడిన భక్తులు వారి వయస్సు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకొని ఎస్ -1 కౌంటర్ వద్ద చూపించాల్సి ఉంటుందని వైవి చెప్పారు. ఆలయానికి కుడి వైపు బ్రిడ్జి కింద గోడ పక్కన మెట్లు ఎక్కాల్సిన పని లేదని ఆయన చెప్పారు.
వృద్ధులు కూర్చోవడానికి మంచి సీట్లు ఏర్పాటు చేసి ఉంటాయనీ, సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారనీ వైవి తెలిపారు. కేవలం 20 రూపాయలకే రెండు లడ్డూ టోకెన్లు ఇస్తారనీ, అదనంగా ఇంకా లడ్డూలు కావాలంటే 25 రూపాయలు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారనీ వైవి చెప్పారు. కౌంటర్ నుండి గుడికి, గుడి నుండి కౌంటర్ వరకూ బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేస్తారనీ. వయో వృద్ధుల దర్శనం కోసం అన్ని క్యూలైన్లు నిలిపివేయడం జరుగుతుందనీ వైవి తెలిపారు. ఎటువంటి వత్తిడి, తోపులాటలు లేకుండా 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం పూర్తి అవుతుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు.