స్కూలు బెదిరింపు కేసులో ఆమె కోసం గాలింపు
కేసు నమోదు చేసిన ఎఫ్.బి.ఐ. అధికారులు
అంతలోనే కాల్చుకుని చనిపోయిన యువతి
డెన్వర్: కొలంబియాలోని ఒక స్కూలును బెదిరించిన కేసులో యువతి కోసం ఎఫ్.బి.ఐ. వర్గాలు ముమ్మరంగా గాలిస్తుండగా, స్కూలుకు 40 మైళ్ల దూరంలో ఆమె మృతదేహం బయటపడింది. సోల్ పైస్ (18) అనే ఆ యువతి కోసం దాదాపు 20 గంటలుగా పోలీసులు గాలిస్తున్నారు. కానీ ఆమె తుపాకితో తనను తాను కాల్చుకుని మరణించింది. ఆమె ఒంటరిగానే ఈ పనికి పాల్పడిందని భావిస్తున్నా, సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఎవరెవరితో సంబంధముందో చూస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఫ్లోరిడాలోని తన ఇంటినుంచి ఈ వారంలోనే ఆమె కొలరాడోకు వచ్చింది. వచ్చాక చట్టబద్ధంగానే ఒక పంప్ యాక్షన్ షాట్ గన్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత నుంచి అదృశ్యమైంది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది.
ఇంతకుముందు కూడా స్కూళ్లలో కాల్పులు జరిగిన ఘటనలు ఉండటంతో పైస్ చేసిన హెచ్చరికలను పోలీసులు తేలిగ్గా తీసుకోలేదు. ఫలితంగా జెఫర్సన్ కౌంటీ పబ్లిక్ స్కూళ్లన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు సంక్షోభం ముగియడంతో స్కూళ్లను మళ్లీ తెరిచారు. సోమవారం రాత్రి నుంచి తమ కూతురు కనిపించడం లేదని పైస్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. గత కొంత కాలంగా ఆమె ఒంటరితనం, కోపంతో బాధపడుతోంది. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టింగులను బట్టి దాడులకు పాల్పడవచ్చని తెలిసింది. ఫ్లోరిడాలో ఉంటున్న తాను కొలరాడోలో తుపాకి కొనాలంటూ అందుకు సలహాలు కూడా అడిగింది. కొలరాడో వచ్చీరాగానే దుకాణాలు వెతుక్కుని ఓ తుపాకి కొంది. అయితే, అసలు బెదిరింపులు ఎందుకు చేసిందో, తర్వాత మళ్లీ ఆత్మహత్య ఎందుకు చేసుకుందోనన్న విషయాలు మాత్రం నిర్ధరించాల్సి ఉంది.