ఆరు ప్లాంట్ల నిర్మాణానికి అంగీకారం
ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం
వాషింగ్టన్: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమెరికా తన అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించబోతోంది. ఇందుకు అంగీకారం కుదిరింది. భద్రత, పౌర అణు సహకార రంగాలను బలోపేతం చేసుకోవాలని అమెరికా, భారత్ సంయుక్తంగా నిర్ణయించాయి. ఇందులో భాగంగానే భారతదేశంలో ఆరు అణు విద్యుత్ ప్లాంట్లను అమెరికా నిర్మించేందుకు ఒప్పందం కుదిరిందని ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
రెండు రోజుల చర్చలు
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు కొనుగోలు దేశంగా భారత్ ఉంది. దీంతో మరిన్ని ఇంధన ఉత్పత్తులను భారతదేశానికి అమ్మాలని ట్రంప్ భావిస్తున్నారు. రెండు రోజుల పాటు వాషింగ్టన్ నగరంలో ముమ్మర చర్చల తర్వాత అణువిద్యుత్ ప్లాంట్ల ఒప్పందం కుదిరింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, అమెరికా ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ భద్రత సహాయ మంత్రి ఆండ్రియా థాంప్సన్ మధ్య ఈ చర్చలు జరిగాయి. పరస్పర భద్రత, పౌర అణు సహకారాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగానే అమెరికా ఆరు అణు విద్యుత్ ప్లాంట్లను భారతదేశంలో నిర్మిస్తుందన్నారు. అయితే, వాటి గురించిన వివరాలు మాత్రం ఏమీ వెల్లడించలేదు.
దశాబ్దం నుంచి ప్రయత్నం
దాదాపు దశాబ్ద కాలం నుంచి అమెరికా తన అణు రియాక్టర్లను భారతదేశానికి ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. కానీ అంతర్జాతీయ నిబంధనలు అందుకు అడ్డుగా నిలుస్తున్నాయి. అణుప్లాంట్లలో ఏమైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యత నిర్వహించేవాళ్లదే అవుతుంది తప్ప రూపకర్తలది కాదన్నది ప్రస్తుతం ఉన్న నిబంధన. భోపాల్ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో భారతదేశానికి చేదు అనుభవాలు ఉన్నాయి. అందుకే ఇన్నాళ్లుగా ఆగింది. పిట్స్ బర్గ్ ప్రాంతానికి చెందిన వెస్టింగ్ హౌస్ సంస్థ కొన్నేళ్లుగా భారతదేశంలో అణు రియాక్టర్ల ఏర్పాటుకు బేరసారాలు చేస్తోంది. కానీ ఇక్కడ అమలులో ఉన్న అణు బాధ్యత చట్టం కారణంగా ఆలస్యం అవుతోంది. 2017లో వెస్టింగ్ హౌస్ సంస్థ కాస్తా దివాలా తీసింది.
వెస్టింగ్ హౌస్ ఆసక్తి
తర్వాత 2018 ఆగస్టు నెలలో తోషిబా నుంచి వెస్టింగ్ హౌస్ సంస్థను కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ ఎసెట్ మేనేజిమెంట్ సంస్థ కొంది. గత ఏప్రిల్ నెలలో వెస్టింగ్ హౌస్ సంస్థకు అమెరికా ఇంధనశాఖ మంత్రి రిక్ పెర్రీ నుంచి భారత విషయంలో మద్దతు లభించింది. ఏపీ1000 తరహా ఆరు అణు రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలని వెస్టింగ్ హౌస్ భావిస్తోంది. 2008లో అమెరికా, భారత్ మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. 2024 నాటికి అణు విద్యుత్ సామర్ధ్యాన్ని మూడు రెట్లు చేయాలన్నది భారతదేశం ఆలోచన. దేశంలో ఒక కొత్త ప్రాంతంలో ఆరు అణు రియాక్టర్ల నిర్మాణానికి గత అక్టోబరు నెలలో భారత్, రష్యా మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది. అవి ఎక్కడ వస్తాయో ఇంకా తెలియలేదు.