(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇండియాలో తమ కార్యకలాపాలు క్రమంగా నిలిపివేయాలని రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ నిర్ణయించుకున్నట్లు భోగట్టా. ఈ నిర్ణయం దరిమిలా ఇండియాలో పని చేస్తున్న ఉన్నతాధికారులలో మూడవ వంతును పదవి నుంచి తొలగించినట్లు ఎకనమిక్ టైమ్స్ పత్రిక తెలిపింది.
వ్యాపార కార్యకలాపాల విస్తరణకు బ్రేకులు వేయాలనీ, క్రమంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకుంటూ పోవాలనీ వాల్మార్ట్ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు ఆ పత్రిక పేర్కొన్నది. కొత్త మాల్స్ నిర్మాణానికి స్థలాలు వెదికే టీమ్ను వాల్మార్ట్ తొలగించినట్లు తెలిపింది. అగ్రి బిజినెస్, వినిమయ వస్తువులు, వస్తు సేకరణ విభాగాలను చూసే వైస్ ప్రెసిడెంట్లను ఉద్యోగం నుంచి తప్పించారు.
దేశవ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల రక్షణ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు వ్యాపారానికి అనుకూలంగా లేకపోవడం వాల్మార్ట్ నిర్ణయానికి ప్రధాన కారణం. అమెరికాకు చెందిన వాల్మార్ట్ కంపెనీ పదేళ్ల క్రితం ఇండియాలోకి ప్రవేశించింది. తమ టోకు వ్యాపారం విస్తరిస్తామనీ, వచ్చే నాలుగేళ్లలో టోకు వ్యాపారం మాల్స్ సంఖ్యను నాలుగు రెట్లు పెంచుతామనీ వాల్మార్ట్ గత సంవత్సరం ఏప్రిల్లో ప్రకటించింది.
వాల్మార్ట్ వంటి బహుళజాతి సంస్థల వల్ల తమ జీవనోపాధి దెబ్బ తింటుందని కిరాణా దుకాణదారులు ఆందోళన చేస్తున్నారు. దేశంలో దాదాపు 12 లక్షల కిరాణా దుకాణాలు ఉన్నట్లు అంచనా. వీరితో ఎక్కువ భాగం బిజెపి మద్దతుదారులు కాబట్టి మోదీ ప్రభుత్వం వాల్మార్ట్ వంటి సంస్థలకు కఠినమైన నిబంధనలను విధించింది. ఆన్లైన్ దిగ్గజాలు ఇష్టం వచ్చినట్లు ఇస్తున్న డిస్కౌంట్ల వల్ల కూడా తాము దెబ్బ తింటున్నామని దేశంలోని చిన్న వ్యాపారులు వాదిస్తున్నారు. ఇండియాలో వాల్మార్ట్ సదుపాయాలను విక్రయించడం, లేక ఫ్లిప్కార్ట్లో విలీనం చేయడం అన్న రెండు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. 2018లో 1600 కోట్ల డాలర్లకు ఫ్లిప్కార్ట్ను వాల్మార్ట్ కొనుగోలు చేసింది.