అమరావతి: విశాఖ జిల్లా పాయకరావుపేట వైసిపి ఎమ్మెల్యే గొళ్ల బాబూరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా ఇంకా వివక్షత కొనసాగుతోందనీ, దళితులంటే చిన్న చూపు చూస్తున్నారనీ, లక్షలాది మంది ఓట్లు వేసి తనను గెలిపిస్తే తనకు స్వేచ్చ ఇవ్వడం లేదనీ, తనకు స్వేచ్చ కావాలనీ బాబూరావు వ్యాఖ్యానించడం సంచలనం అయ్యింది.
ఎమ్మెల్యేలు సంతోషంగా ఉండే విధంగా చూసుకోవాలని సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ సూచన చేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తనకు ఎదురవుతున్న అవమానాలను బహిరంగంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.
గోళ్ల బాబూరావు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున, 2019 ఎన్నికల్లో వైసిపి తరుపున పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ప్రకటించిన టిటిడి బోర్డు పాలకవర్గంలో డైరెక్టర్గానూ ఎంపికయ్యారు.
గాంధీ జయంతి సందర్భంగా జరిగిన ఏర్పాటు చేసిన సభలో దళిత ప్రజా ప్రతినిధినైన తానే ఇంకా వివక్షతకు గురి అవుతున్నానంటూ వ్యాఖ్యానించారు. సమాజంలో ఇంకా వివక్షత కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘ఒక దళిత ఎమ్మెల్యే తనపై వివక్ష చూపిస్తున్నారని బాధపడుతుంటే, ఇంక రాష్ట్రంలో దళిత ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.
మానవజాతి ఔన్నత్యం మనుషులుగా జన్మించటంలో లేదు.. మానవత్వంతో జీవించటంలోనే ఉందన్నారు గాంధీ మహాత్ముడు. అలాంటి బాపూజీ పుట్టిన గడ్డ మీద, ఆ మహానుభావుని జయంతి రోజునే ఒక దళిత ఎమ్మెల్యే తనపై వివక్ష చూపిస్తున్నారని బాధపడ్డారంటే, ఇంక రాష్ట్రంలో దళిత ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. pic.twitter.com/EqKASXGr72
— Lokesh Nara (@naralokesh) October 2, 2019