అమరావతి: నవ్యాంధ ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నర్శింహన్ జగన్మోహనరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
వైఎస్..జగన్మోహన్ రెడ్డి అనే నేను..ముఖ్యమంత్రిగా అంటూ..దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయగా అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేశారు. సిఎం, సిఎం అన్న అభిమానుల నినాదంతో స్టేడియం హోరెత్తిపోయింది.
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసము, విధేయతా చూపుతాననీ, భారతదేశ సార్వభౌమాధికారాన్నీ, సమగ్రతను కాపాడుతాననీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాననీ, భయంగానీ, పక్షపాతంగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాననీ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని జగన్ పేర్కొన్నారు.
తరువాత ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు తెలియపరచననీ లేదా వెల్లడించననీ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతి, కుమార్తెలు, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, డిఎంకె నేత స్టాలిన్, యానాం ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ శాఖ మంత్రి మహబూబ్ ఆలీ, టిఆర్ఎస్ నేత కె.కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, వామపక్షాల నేతలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, పలు రాష్ట్రాల ప్రముఖులు వేదికపై ఆశీనులు కాగా పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం అయిన వెంటనే సర్వమత ప్రార్థనలు నిర్వహించిన మతపెద్దలు జగన్మోహనరెడ్డిని ఆశీర్వదించారు.
ముందుగా జగన్మోహనరెడ్డి టాపులేని జీపులో వేదిక చుట్టూ తిరిగి అభిమానులకు అభివాదం చేశారు. జగన్మోహనరెడ్డి సభాస్థలికి రాగానే మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో హెలికాఫ్టర్తో పూలు చల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు.