అమరావతి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని పార్టీ శ్రేణులకు వైసిపి శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు నిచ్చారు. శాసనసభాపక్ష నేతగా ఎకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసిన జగన్ ఈ ఘన విజయానికి తనతో పాటు అందరూ కారణమని అన్నారు. గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా వైసిపి అండగా నిలిచిందనీ, ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చామని జగన్ పేర్కొన్నారు. 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను ఇచ్చి ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారని జగన్ అన్నారు.
అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. ఈ విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని జగన్ అన్నారు.
‘మన పార్టీ నుంచి అన్యాయంగా చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23 మంది, ఎంపిలు ముగ్గురు. ఇప్పుడు టిడిపికి మిగిలింది, చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య కూడా 23 – 3. దేవుడు చాలా గొప్పగా ఈ స్క్రిప్ట్ రాశాడు’ అని జగన్ అన్నారు.
‘మన టార్గెట్ 2024. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవాలి. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పెర్ఫార్మెన్స్ చూసి ప్రజలు 2024లో మనకు ఓటెయ్యాలి’ అని జగన్ పేర్కొన్నారు.
రాజకీయాలను ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తానని జగన్ స్పష్టం చేశారు. ఆ ప్రక్షాళన మామూలుగా ఉండదు, దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ఆ ప్రక్షాళనకు మీ అందరి సహాయసహకారాలు కావాలని జగన్ అన్నారు.
మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తానని జగన్ పేర్కొన్నారు.