అమరావతి: వైసిపికి అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన ఇంటి దగ్గర చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు: ‘ఇంత ఘన విజయం నా బాధ్యత పెంచింది’.
నిజమే. 175 సీట్లకు 151 సీట్లు కట్టబెట్టిన ప్రజలు ముఖ్యమంత్రి నుంచి అద్భుతాలు ఆశిస్తారు. మెజారిటీ ఎక్కువ ఇచ్చినంత మాత్రాన పనులు క్షణాలలో జరగవనీ, ప్రతిదానికీ ఒక పద్ధతి ఉంటుందనీ ఆలోచించేవారు తక్కువ ఉంటారు. మిగతా అంశాలన్నీ ఎలా ఉన్నా ప్రత్యేకహోదా అంశం జగన్ను ఇబ్బందిలోకి నెట్టే అవకాశం మెండుగా ఉంది.
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టిన జగన్, ఎన్నికల ప్రచారంలో దానిని జనంలోకి తీసుకువెళ్లగలిగారు. చివరివరకూ మోదీతో అంటకాగిన చంద్రబాబు ఎన్నికల ముందు యుటర్న్ తీసుకున్నారనీ, ఆయన చేసేవి అవకాశవాద రాజకీయాలనీ జగన్ విమర్శించారు. కేంద్రం నవ్యాంధ్రకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించినపుడు దానిని సమర్ధిస్తూ చంద్రబాబు అన్న మాటలను ఆయన తనకు అనుకూలంగా వాడుకోగలిగారు.
కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారన్న ప్రశ్న ఈ ఎన్నికల ముందు వచ్చినపుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ మద్దతు ఉంటుందని జగన్ స్పష్టంగా చెప్పారు. నిజానికి ఎన్నికల ఫలితాలపై అప్పుడున్న అంచనాలు వేరు. బిజెపికి సొంతంగా మెజారిటీ రాదనీ, ప్రాంతీయ పార్టీలపై ఆ పార్టీ ఆధారపడాల్సి వస్తుందనీ అప్పుడు చాలామంది గట్టిగా నమ్మారు.
తీరా చూస్తే మోదీ నాయకత్వంలోని బిజెపి 2014 కన్నా ఎక్కువ సీట్లు సాధించగలిగింది. ఇప్పుడు ఆ పార్టీకి ఎవరి మద్దతూ అక్కరలేదు. ఇలాంటప్పుడు జగన్ మాట మోదీ ఎందుకు వినాలి? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని నీతిఅయోగ్ సంస్థ చెప్పిందన్న వాదనకు మోదీతో సహా బిజెపి మంత్రులు కట్టుబడ్డారు. తాము ఆలా చెప్పలేదని నీతి అయోగ్ సభ్యులు ఆతర్వాత వివరణ ఇచ్చినా కేంద్రంలోని బిజెపి పెద్దలు అదే మాట పదేపదే వల్లె వేస్తూ వచ్చారు. ఇప్పుడు దాని నుండి వైదొలగడం కష్టం.
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరిని తీవ్రంగా విమర్శించిన వైఎస్ జగన్ ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరించాలంటే ఈ విషయంలో మోదీతో తలపడాలి. జగన్ ఆపని చేయగలరా? చేస్తే మోదీ ఊరుకుంటారా? మోదీ వ్యవహారశైలి, తన ప్రత్యర్ధుల పట్ల ఆయన వ్యవహరించే తీరు ఈపాటికే అందరికీ అర్ధమయిపోయాయి. అందుకేనేమో జగన్ కూడా నిన్న ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఇక్కడ ఎలా మాట్లాడినా, మోదీ దగ్గర ఎలా మాట్లాడినా ప్రజలకు కావాల్సింది అది కాదు, ప్రత్యేకహోదా సాధించారా లేదా అన్నది. ఈ విషయంలో కొరకరాని కొయ్య లాంటి మోదీతో జగన్కు కష్టాలు తప్పవనే అనిపిస్తోంది.