గౌహతి: అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్ఆర్సీ) తుది జాబితా విడుదలైంది. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. తుది జాబితాలో సుమారు 3.11 కోట్ల మందికి చోటు దక్కొంది. గత ఏడాది విడుదలైన ఎన్ఆర్సీ జాబితాలో సుమారు 41 లక్షల మందికి చోటు దక్కలేదు. దీంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజగా తుది జాబితాను విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం అసోంలో ఉన్న 3,11,21,004 మంది భారత పౌరులుగా గుర్తింపును పొందారు. 19,06,657 మందిని జాబితా నుంచి తొలగించారు. జాబితా నుంచి తొలగించబడ్డ వారంతా విదేశీయుల కిందే లెక్క. వీరిలో సరైన గుర్తింపు పత్రాలను ఇవ్వని వారు కూడా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో భారీగా భద్రతా బలగాలను మొహరించింది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 144సెక్షన్ విధించారు. సున్నితమైన కశ్మీర్ అంశం ఇంకా చల్లారకముందే మరో కీలక అంశం ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల కావడంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
మరోవైపు జాబితాలో లేకపోయినా ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించబోమని కేంద్రం ప్రకటించింది. విదేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్లో తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది. ఎవరినీ నిర్బంధించబోమంటూ హామీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే.. జాబితాలో లేనివారు ట్రైబ్యునల్లో, తరవాతి దశలో హైకోర్టులో అప్పీలు చేసుకుని న్యాయం పోరాటం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 ట్రైబ్యునల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 100 ట్రైబ్యునల్స్ పని చేస్తుండగా సెప్టెంబర్ మొదటి వారంలో మరో 200 ట్రైబ్యునల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మొత్తం ట్రైబ్యునల్స్ అందుబాటులోకి రానున్నాయి.