హైదరాబాద్: నగరంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలపైన కేటీఆర్.. విభాగ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ సమావేశం అవుతానని తెలిపిన కేటీఆర్.. ప్రతి విభాగం తన కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపైన ఒక నివేదిక సమర్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రయత్నించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఆరు జోన్లకు సంబంధించి అధికారులు అంతా ఉదయాన్నే గ్రామాల్లో పర్యటించాలని కేటీఆర్ అదేశించారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ లోకేశ్ కుమార్తో పాటు ఉన్నతాధికారులు, కార్పొరేటర్లు రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తామని అన్నారు. తాను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతానని తెలిపారు. హైదరాబాద్ నగరంలో చెత్త వేసే వెయ్యి ప్రాంతాలను గుర్తించామని… వాటిని యుద్ధప్రాతిపదికన తొలగిస్తామని వెల్లడించారు. ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని కేటీఆర్ అన్నారు. కాలేజీలు, స్కూళ్లతో పాటు ఇళ్లల్లోనూ దీనిపై ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తామని వివరించారు. ప్రజల సహకారం ఉంటేనే ఈ వ్యాధులు అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాబోయే 15 రోజుల్లో డెంగ్యూను పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని వెల్లడించారు. రోడ్లను బాగు చేసేందుకు కొత్త తరహా నిర్ణయం తీసుకోబోతున్నామని తెలిపారు. నిర్మాణ వ్యర్థాలను సక్రమంగా డంపింగ్ చేయని వారిపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.