(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పొరుగు రాష్టమైన తెలంగాణకు కాసులు కురిపిస్తున్నది. కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా దరఖాస్తు రుసుము రూపేణా 400 కోట్ల రూపాయలకు పైగా వసూలయింది.
ఈ నెల ప్రారంభం నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రయివేటు మద్యం షాపులు మూతబడ్డాయి. ప్రభుత్వ వైన్ షాపులు ప్రారంభం అయ్యాయి. ఇన్నాళ్లు మద్యం వ్యాపారంలో ఉన్న వారు తెలంగాణలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దరఖాస్తు రుసుము కూడా పెంచవచ్చని భావించి రాష్ట్రంలో ఎక్కడ లైసెన్సు కోసం దరఖాస్తు చేసినా రెండు లక్షల రూపాయలు చెల్లించాలని ప్రకటించారు. గతంలో ఈ దరఖాస్తు రుసుము నగరంలో లక్ష రూపాయలు, మండల కేంద్రాలలో 75 వేలు, గ్రామాలలో 50 వేల రూపాయలు ఉండేది.
మద్యం షాపులకు పోటీ పెరగడం, దానికి తోడుగా దరఖాస్తు రుసుము పెరగడం ఫలితంగా మంగళవారం నాటికి తెలంగాణ ప్రభుత్వానికి ధరఖాస్తు రుసుము రూపేణా 412 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. దరఖాస్తుల సమర్పణ గడువు బుధవారంతో ముగుస్తుంది.
మంగళవారం సాయంత్రానికి తెలంగాణలో ఉన్న 2216 మద్యం షాపులకు 20,630 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క మంగళవారమే 9788 దరఖాస్తులు అందాయి. ఇప్పటికి అందిన దరఖాస్తుల ప్రకారం ఒకొక్క దుకాణానికి సగటున సుమారుగా పది దరఖాస్తులు వచ్చినట్లు లెక్క. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలో అన్నిటికన్నా ఎక్కువగా 3,169 దరఖాస్తులు దాఖలయ్యాయి.