(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హుజూర్నగర్ ఉపఎన్నిక క్లైమాక్స్ కు చేరింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై..టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా ప్రసంగించాలని నిర్ణయించారు. ప్రచారానికి మరో మూడ్రోజులు మాత్రమే ఉండటం, బహిరంగసభకు సీఎం కేసీఆర్ వస్తుండటంతో ప్రచారం మరింత జోరందుకోనున్నది. సభకు దాదాపు 50వేల మంది ప్రజలు హాజరుకానున్నట్టు సమాచారం. అయితే కేసీఆర్ ఈ సభకు హాజరువుతారా? లేదా? అన్న సస్పెన్స్ నెలకొంది. అభ్యర్థి ఎన్నికల ఖర్చు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టడం.. ఆర్టీసీ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలే అవకాశం ఉండటంతో కేసీఆర్ హుజూర్ నగర్లో అడుగుపెడుతారా లేదా? అన్న చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షాడో టీమ్స్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో స్పెషల్ ఫోకస్ పెట్టాయి. సీఎం రాకపోకలు.. బహిరంగ సభకు అయ్యే ఖర్చులు.. వీటన్నింటి అభ్యర్థి ఖాతాలోనే ఎన్నికల సంఘం లెక్క కడుతుంది. సీఎం సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు రోడ్షోలు, సభలు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. కేసీఆర్ సభకు ఆర్టీసీ కార్మికులు కూడా హాజరై నిరసన తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కార్మికులు వినూత్న ప్రదర్శనలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని ఆది నుంచి చెబుతూ వస్తున్న కేసీఆర్.. కార్మికుల ఆత్మహత్యల తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారినా.. అదే వైఖరిని కొనసాగిస్తుండటం గమనార్హం. దీంతో ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళన ఉధృతం చేశారు. సమ్మెకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరోవైపు హుజూర్ నగర్ సభకు ఆర్టీసీ కార్మికులు కూడా హాజరై.. నిరసన తెలిపితే.. పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ హుజూర్నగర్లో ప్రచారానికి వస్తారా రారా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.