(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు 17వ రోజుకు చేరాయి. ఆందోళనలో భాగంగా శుక్రవారం జెఎసి నేతలు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించారు. మందడం గ్రామంలో రైతులు దుకాణాలను మూసివేయించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి గులాబి పూలు ఇస్తూ రైతులు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. సకల జనుల సమ్మె భగ్నం చేసేందుకు పోలీసులు దుకాణాలను తెరిపించేందకు ప్రయత్నించడంతో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నది. సచివాలయం వైపు వెళ్లే రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు.పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలు తుడిచి పూలు ఇచ్చి సకల జనుల సమ్మెకు మద్దతు కోరుతున్నారు. తుళ్లూరు, వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లోనూ జెఎసి నేతల పిలుపుతో వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు.టీస్టాల్స్, హోటల్స్ మూసివేయించారు. ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో రైతులు, కూలీలు నిరసన దీక్ష చేపట్టారు. ‘మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధానే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.
మంగళగిరి అంబేద్కర్ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో వివిధ రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో అమరావతి కోసం నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో రైతులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలాన్ని రేపింది. గత రాత్రి సుమారు 15మంది రైతులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఐపిసి 307 కేసుతో పాటు మరో ఏడు సెక్షన్ల కింద కేసులు ఉన్నందున విచారణ నిమిత్తం చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్కు రావాలని నోటీసులు అందజేశారు.