(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కోల్కతా: అడ్డగోలు వ్యాఖ్యలతో నిత్యం వివాదాలను ఆహ్వానించే పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన వాచాలతను మరోసారి చాటుకున్నారు. ఈసారి మహిళలంటే తనకెంత చులకన భావనో చెప్పుకున్నారు. తన ర్యాలీ ముందు నిరసన తెలిపిన మహిళ తనకేమీ జరగనందుకు సంతోషించాలని ఆయన వ్యాఖ్యానించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా గురువారం నగరంలో బిజెపి నిర్వహించిన ర్యాలీ దగ్గర ఒక ఒంటరి మహిళ నిరసన తెలిపారు. 20 ఏళ్ల పైబడి వయసున్న ఆ మహిళ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ బయట నిరసనకారులపై ఒక యువకుడు జరిపిన కాల్పులను నిరసిస్తున్నట్లు తెలిపే పోస్టర్ పట్టుకుని నిలబడ్డారు.
ఆమెను చూడగానే బిజెపి కార్యకర్తలు పోస్టర్ లాక్కొని చించారు. ఆమెను దూషిస్తూ అవహేళన చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను సురక్షితంగా తీసుకువెళ్లారు. మా కార్యకర్తలు చేసిన పని సరైనదే. అంతకుమించి తనకేమీ జరగనందుకు ఆ మహిళ తాను అదృష్టవంతురాలినంటూ సంతోషించాలి అని దిలీప్ ఘోష్ తర్వాత వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్ష నాయకులు ఖండించారు. నిరసన తెలిపిన ఆ యువతి మాత్రం భయపడలేదు. ఫాసిస్టు బిజెపికి వ్యతిరేకంగా మళ్లీ నిరసన తెలుపుతానని చెప్పారు. ఘోష్ వ్యాఖ్యలు ఆయన, ఆయన పార్టీ ఎంత దుర్మార్గంగా, ఎంత వక్రంగా ఆలోచిస్తారో చెబుతున్నాయని సిపిఎం సీనియర్ నేత షామిక్ లాహిరి పేర్కొన్నారు.