ఎనిమిది మంది సిక్కు అతివాదులకి భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఒకరికి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ఎంతో జాలి, దయ ఉన్నదానిలాగా కనిపించటం మొదలయ్యింది.
“దేశద్రోహుల పట్ల ఎటువంటి సహనం ఉండదు” అనే అరుపులు వినటానికి అలవాటు పడిపోయిన నేటి రోజుల్లో చావుకు ఎదురుచూసేవారినీ, నిస్సహాయులనూ ఈ సార్వభౌమ దేశం ఈ విధంగా ఆదుకోవటం ఆశాజనకమైన విషయం. ఈ జాతీయవాదపు రోజుల్లో- మానవత్వాన్ని జాతీయవాదం అనే సంకుచితమైన సిద్ధాంతం పక్కకు నెట్టిందని మనం భావిస్తున్న ఈ రోజుల్లో- కూడా మానవత్వం ఇంకా మిగిలే ఉంది అన్న ఒక విశ్వాసం కలగటం ఆశాజనకమైన విషయం.
దేశ ప్రయోజనాలకి విరుద్ధంగా పని చేస్తున్నారన్న అనుమానంతో, విదేశీ పాస్ పోర్టులు కలిగిన కొందరి పేర్లను భారతదేశానికి రాకుండా గతంలో ప్రయాణ నిషేధం జాబితాలో చేర్చారు. తీవ్రవాదం పట్ల “రాజీపడని ధోరణి” అవలంబిస్తామని చెప్పే ఈ ఉక్కు రాజ్యం చాలా మంది పేర్లని ఆ జాబితా నుండి తొలగించింది.
“ ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న అనుమానితుల జాబితాలో ఉన్న 314 మంది సిక్కు మతానికి చెందిన విదేశీయుల సంగతి కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. ఆ జాబితాని 2 పేర్లకి కుదించింది.” అని ఒక అధికారి తెలిపారు. “ఈ సిక్కు విదేశీయులు ఇప్పుడు తమ వీసా సేవలను ఉపయోగించుకుని భారతదేశంలో నివసిస్తున్న తమ కుటుంబసభ్యులను కలవొచ్చు, తమ మూలాలతో తిరిగి సంబంధాలు పెంపొందించుకోవచ్చు” అని అధికారులు తెలిపినట్లు ఎకనామిక్ టైమ్స్ వార్తా కథనం ప్రచురించింది.
గురునానక్ దేవ్జీ ఆగమనానికి 550 ఏళ్లు నిండిన ప్రకాష్ పర్వ్ సందర్భంగా ఈ క్షమాభిక్ష పెట్టడం పాత నమ్మకం ఒకదాన్ని బలపరుస్తుంది- మంచి వాళ్ళ సాంగత్యంలో ఉంటే క్షణకాలమైనా సరే మనలోని మంచితనం కూడా పురివిప్పుతుంది అని. ఇక్కడ ఇంకొక విషయం కూడా స్పష్టం. సిక్కులు ఆరాధించే వ్యక్తికి సంబంధించిన ప్రకాష్ పర్వ్ సందర్భంగా వచ్చే కరుణ అంతా కూడా సిక్కుల మీద మాత్రమే ప్రసరిస్తుంది అని.
ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపరిచే విషయం బల్వంత్ సింగ్ రాజోనాకి విధించిన మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం. పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ని హతమార్చిన ముఠాలో ఈయన సభ్యుడు. ఈ హత్యాకాండలో బియాంత్ సింగ్, ముగ్గురు కమేండోలతో సహా పదిహేడు మంది మృతి చెందారు. దీన్ని ఉగ్రవాద చర్యగా పరిగణించారు. బియాంత్ సింగ్ను హతమార్చడంలో ఒక ప్రయత్నం విఫలం అయితే ఆత్మాహుతి ద్వారా ఆయనను చంపే బ్యాకప్ పాత్ర రాజోనాది.
సహజంగానే వివిధ సిక్కు సంస్థలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల తమ హర్షాన్ని ప్రకటించాయి. ఏషియన్ ఏజ్ కథనం ప్రకారం పంజాబ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుఖి చలాల్ ఫేస్బుక్లో ఈ విధంగా రాశారు:
“సౌహార్ద చర్యగా సిక్కు ఖైదీలని విడుదల చేసిన, అలాగే బల్వంత్ సింగ్ రాజోనా మరణ శిక్షని యావజ్జీవ శిక్షగా తగ్గించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షా కి, కేంద్ర ప్రభుత్వం మొత్తానికి నేను వ్యక్తిగతంగా కృతజ్ఞుడ్ని.”
“సిక్కు సమాజం అనుభవిస్తున్న బాధ నుండి ఉపశమనం కలిగించటానికి ఈ దయామయ చర్య ఎంతగానో ఉపకరిస్తుంది. ఒక సిక్కుగా, ఇంగ్లండ్, సౌథాల్ లోని శ్రీ గురు సింగ్ సభ అధ్యక్షునిగా నా కృతజ్ఞతలు.” అని సర్దార్ హెచ్.ఎస్.సోహి తెలిపారు.
“కేవలం సిక్కులే కాదు, అన్ని మతాల వారు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. గురు నానక్ 550వ జయంతి నాడు ఇది ఆయన మా మీద చూపించిన కరుణగా, కురిపించిన ఆశీస్సులుగా భావిస్తున్నాము. ఇది పెద్ద ఉపశమనం.” అని ఏఎన్ఐతో మాట్లాడుతూ రాజోనా సోదరి తెలిపారు.
శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వారు బల్వంత్ సింగ్ మరణశిక్షని రద్దు చెయ్యమని చేసిన డిమాండ్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. వారి విజ్ఞప్తిని అనుసరించే 2012 మార్చి 31నాడు జరగవలసిన ఉరితీత కార్యక్రమాన్ని వాయిదా వేస్తునట్టు 2012 మార్చి 28 నాడు హోం శాఖ ప్రకటించింది.
అయితే దానికి కేవలం నెల రోజుల ముందే ఎంతో మంది చేసిన విజ్ఞప్తులని కాదని అఫ్జల్ గురుని ఉరితీశారు. అలాగే యాకూబ్ మెమన్ ఉరి విషయంలో కూడా విజ్ఞప్తులని తోసిపుచ్చారు.
ఈ రెండు సందర్భాలలో విజ్ఞప్తులని విస్మరించటమే కాదు ప్రజా బాహుళ్యంలో ఈ విజ్ఞప్తులని చాలా హింసాత్మకంగా వ్యతిరేకించారు. ఉరి తీసిన ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పటికీ దాని గురించి మాట్లాడటం మహాపాపమే. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దేశ ద్రోహులు పాగా వేశారు అని ఒక కట్టుకథ ప్రచారంలోకి రావటానికి కారణం ఆనాడు ఈ ఉరితీత గురించి అక్కడ పెట్టిన సమావేశమే. అయితే అఖల్ తఖ్త్ రాజోనాకి జిందా షహీద్ బిరుదు ఇచ్చినప్పుడు కనీసం గుసగుసలు కూడా వినపడలేదు.
మరణశిక్షకి తాను వ్యతిరేకం అన్న సాకుతో రాజోనా శిక్ష మార్పిడి విషయం మీద నోరు మెదపని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కి తాను నిజాయితీగా లేనని బాగా తెలుసు.
తమ సాటి మతస్థులకి క్షమాభిక్ష కోసం పోరాడుతున్న సిక్కు సంస్థలకు అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్ల రోదనే వినపడలేదు, ఇక వారేం మాట్లాడతారు? 1984లో నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు ఇద్దరు హత్య చేశాక సిక్కు సమాజాన్ని ఊచకోత కోసిన హిందూ తీవ్రవాదులు ఈ రోజు సిక్కుల విషయంలో కాస్త మెత్తబడినట్లున్నారు. రాజోనా లాంటి వారు “ఎటువంటి సందర్భాలలో” అటువంటి చర్యలకి “పాల్పడవలసి” వచ్చిందో మనం అర్థం చేసుకోవాలని వారు సెలవిస్తున్నారు.
ఈ క్షమాభిక్ష ప్రసాదించిన సమయాన్ని గుర్తించటంలో మీడియా విఫలం చెందలేదు. త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి., అక్కడ చాలా నియోజకవర్గాలలో సిక్కులు గెలుపోటములని శాసించే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈ దయ అవకాశవాదం, ఈ క్షమ వెనుక ఓట్ల లెక్కలు ఉన్నాయి.
ఒకప్పుడు దేశ ద్రోహులుగా ముద్ర పొందిన సిక్కుల పట్ల ఈ దయ చూపడంతో పాటు 1984 ఊచకోతకి సంబంధించిన విచారణని వేగవంతం చేసిన విషయాన్ని కూడా మీడియా రిపోర్టు చేసింది.
ఈ ప్రభుత్వం కరుణామయ చర్య ఇదొక్కటే కాదు. ప్రభుత్వం నిర్మిస్తున్న దయాపూరిత వ్యవస్థలో ఇది ఒక భాగం మాత్రమే. జాతీయ పౌర జాబితాలో పేరు లేని వారు భయపడాల్సిన అవసరం లేదని హోం మంత్రి అమిత్ షా అభయమిచ్చారు. అయితే ఒకే ఒక్క షరతు- వాళ్ళు ముస్లింలు అయ్యుండకూడదు.
ఇదంతా మనం చదువుతున్నప్పుడే పశ్చిమ భారతదేశంలో ఒక తల్లి ఆక్రందన మనకి వినపడుతుంది. ఆమె 19 సంవత్సరాల కూతురుని గుజరాత్ పోలీసులు అన్యాయంగా చంపేశారు. ఈ కేసులో ముద్దాయిలందరినీ ఒకొక్కరిగా వదిలివేస్తుండగా, ఈ కేసుని దర్యాప్తు చేయాల్సిన సంస్థకి ఈ కేసు మీద ఎటువంటి ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు. రాజ్యం ఉద్దేశపూర్వకంగా, అన్యాయంగా హతమార్చిన తన కూతురికి న్యాయం కావాలన్నది ఆ తల్లి డిమాండ్. కానీ ఆవిడకి తప్ప ఇది ఎవరికీ పట్టింది లేదు. మృతురాలు ముస్లిం అని మీరు ఊహించాల్సిన పని కూడా లేదు. ఆమె పేరు ఇష్రాత్ జహాన్.
ఇలాంటి సందర్భంలో మిగతా విషయాలు గురించి మాట్లాడటం ఏమంత బాగోలేదు అని కొంతమంది అనవచ్చు. జరగక జరగక ఒక మంచి పని జరిగితే మనం దానిని ఇతర విషయాలతో పోల్చి చూడడం, రాజ్యం కొన్ని విషయాలలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది కాబట్టి ఇతర విషయాలలో కూడా జాలి, దయ లేకుండా ఉండాలి అనడం సరి కాదని వారు అనవచ్చు.
ఈ రకంగా చూపించిన దయ నిజంగానే ఒక బంధంగా పని చేస్తుంది. సిక్కులకి, భారత రాజ్యానికి మధ్య ఒక అగాధమైతే ఉంది. తొంభైవ దశకంలో అదృశ్యమైన అనేకమంది యువకుల కుటుంబసభ్యులు ఎవరైనా తమ గోడు వినడం కోసం నేటికి ఎదురుచూస్తున్నారు. క్షమార్హం కాని వారిని క్షమిస్తే మనం కోపగించుకోకూడదు. అలా క్షమించటమే ‘క్షమ అనే పదానికి సార్ధకత చేకూరుస్తుంది.
అయితే ఇలా క్షమకు అర్హులను ఆచి తూచి ఎంపిక చెయ్యటం అనేది చాలా బాధాకరమైన సంగతి. సహానుభూతికి దూరంగా ఏవో అవసరాల కోసం ఏవో లెక్కలు వేసి చేసిన ఈ చర్య వెనుక ప్రజలను చీల్చే ఉద్దేశాలు ఉన్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి ఫ్రంట్ను తయారుచెయ్యడమే దీని వెనుక ఉన్న స్పష్టమైన ఆలోచన. సిక్కులకి క్షమాభిక్ష ప్రసాదించటం, 1984 ఊచకోతకి సంబంధించిన విచారణను వేగవంతం చెయ్యడం వారిని ముస్లిం వ్యతిరేక క్యాంపులోకి తీసుకురావటం కోసమే. గురు నానక్ అనుచరులు దీనిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?
అపూర్వానంద్
వ్యాస రచయిత ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడు
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో