సీరియల్స్ – పిల్లలు మసి అనే కథనం ఈ ఆదివారం సాయంకాలం టీవీ-9 వార్తలలో చాలా వివరంగా ప్రసారమైంది. సీరియల్స్ ప్రసారం, కుటుంబ సంబంధాలు, పిల్లల పోకడలు, సమాజ ఆరోగ్యం అనే రీతిలో ఆ వార్తకు రాసిన స్క్రిప్ట్ సాగిపోయింది. పనిలో పనిగా సోషల్ మీడియా కలిగించే అనర్థాలనూ కలిపారు. దాంతో పిల్లలు మసి అని తేల్చేసి ఈ రెండింటి మీద ఎంతో కొంత నియంత్రణ కావాలన్నట్టు ఆ వార్తా ప్రబోధం ముగిసింది. బాగానే ఉంది కానీ ఆ రెంటితోపాటు న్యూస్ ఛానళ్ళలో అరుపులు, తిట్లు, కేకలు గురించిన మాటేమిటి? ఇవి సీరియళ్ళ కన్నా మెరుగా? తమకు సంబంధం లేకపోతే ఎవరు ఏమైనా తీర్పు చెప్పవచ్చు ! ఇండియా – పాకిస్తాన్ సంబంధించి బిబిసి చాలా వార్తలు ఇచ్చేది – ప్రయివేటు ఛానళ్ళు రాకముందు జాగ్రత్తగా రాసేవాళ్ళం కదా! అయితే ఇతర దేశాల గురించి కనబడే ఆబ్జెక్టివిటి తమ దగ్గర ఆగిపోతుందా అన్నట్టు బ్రిటీషు దేశం ఫాక్ ల్యాండ్ దీవుల ఆక్రమణ సమయంలో బిబిసి చాలా స్వయం నియంత్రణ పాటించింది!
ఛానళ్ళు సినిమా ఆదాయానికి అలవాటుపడి న్యూస్ బులెటిన్లు రద్దు చేస్తాయి – ఒక ఈటీవీ అలాంటి పని చేయడం లేదు కదా – అని భావిస్తూ వుండేవాడిని. ఎందుకంటే అలాంటి కార్యక్రమం ఎప్పుడూ కనబడలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు సభలు సరిగ్గా బులెటిన్ టైమ్లో ఉండేవి, వార్తలు బదులు లైవ్ ఇచ్చేవారు! సినిమా కార్యక్రమాల విషయంలో జరుగలేదు కదా అని తలుస్తూ ఉండేవాడిని. కానీ నవంబరు 17న అక్కినేని అవార్డ్స్ అంటూ అన్ని ఛానళ్ళూ లైవ్ ఇచ్చాయి – ఇవ్వకపోతే దోషమన్నట్టు.. ఈటీవీ రెండు న్యూస్ ఛానళ్ళు ఆరున్నరకు లైవ్ ఆపి శ్రీనిలయం అనే స్పాన్సర్డ్ కార్యక్రమాన్ని ఇచ్చాయి. టీవీ5 కూడా లైవ్ ఆపి స్పాన్సర్డ్ కార్యక్రమం ఇచ్చింది. దాంతో దాదాపు గంటపాటు వార్తా ఛానళ్ళు అన్నీ నాన్ న్యూస్ ఛానళ్ళుగా మారిపోయాయి.
స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కోసం లైవ్ ఆపారు అంటే లైవ్తో ఆర్థిక కారణం ముడిపడి లేదా? లేదా అరగంటకే పైకం ఇచ్చారా? సమాచారం లేదు కానీ, సంఘటన మొదలైనపుడు వార్తలు ఆపి లైవ్ ఇచ్చారు కనుక ఆర్థిక పార్శ్వం ఉండకపోవచ్చు. మరి అలా అయితే వేలంవెర్రిగా పదుల సంఖ్యలో సినిమా ప్రోగ్రాం లైవ్ ఇస్తే తమకు ఏవిధంగా లాభిస్తుందో బోధపడదు. ఆ సమయంలో టీవీ చూసే వీక్షకులను తప్పక సోషల్ మీడియా వైపు నడిపిస్తాయి ఛానళ్ళు.
నిన్న ఆదివారం (నవంబరు 24) టీవీ5 పార్వతీ కళ్యాణం సంబంధించి లైవ్ ఇస్తే, టీవీ-9 గోదావరి హారతి లైవ్, కాగా సాక్షి టీవీ ఇటీవల విడుదలయిన రాగల 24 గంటలలో అనే సినిమా గురించి లైవ్! కోటి దీపోత్సవం అని ఎన్ టీవీ రెండు వారాలపాటు మూడు నాలుగు గంటలు వార్తలు రద్దు చేసి ఆధ్యాత్మికంగా మారిపోతోంది ఏటా. దీన్ని చూసి ఐదారేళ్ళుగా టీవీ-5 శివపార్వతుల కళ్యాణం మొదలుపెట్టింది.
భక్తి, ఆధ్యాత్మికత ఇలా తాండవిస్తుండగా ఇదే న్యూస్ ఛానళ్ళలో క్రైమ్ కథనాలు, క్రైమ్ ఆధారంగా నడిచే అనుసృజన కార్యక్రమాలు ఇటీవల బాగా పెరిగాయి. ఏబిఎన్ కావచ్చు, ఎన్ టీవీ కావచ్చు, టీవీ-9 కావచ్చు. మిగతా న్యూస్ ఛానళ్ళు ఏమిస్తున్నాయో పూర్తిగా పరిశీలించాలి.
బిగ్ బాస్ అయిపోయింది. అయితే ఈ కార్యక్రమం ఆధారంగా నడిచే కార్యక్రమాలు ఇంకా ప్రసారమవుతున్నాయి. ఇవి ఎందుకు ప్రసారమవుతాయో వీక్షకులకు అస్సలు తెలీదు. ఈ అరగంట కార్యక్రమాలు ఆ బిగ్ బాస్ నడిచే కాలంలో ఎన్.టీవీ, సాక్షి టీవీ, ఏబిఎన్, టీవీ-9 వంటి ఛానళ్ళలో కూడా ప్రసారమయ్యాయి.
ఇలాంటి పోకడలన్నీ ఛానళ్ళ ఆర్థిక సంబంధాలే! అయితే వివరాలు వీక్షకులకు తెలియకపోవచ్చు. అన్నట్టు ‘న్యూస్’ అనే మాటను వార్తాఛానళ్ళ కార్యక్రమాలలో చాలా సృజనాత్మకంగా, ప్రతిభావంతంగా వాడుతున్నారు. ఒక ఉదాహరణ ‘న్యూసులు’ ! ఏ ఛానల్, ఏ కార్యక్రమం అని అడగవద్దు. మీరు ప్రయత్నిస్తే మరిన్ని ఆణిముత్యాలు దొరకవచ్చు, జ్ఞాన సంపదను పెంచుకోండి !
మరి వచ్చేవారం కలుద్దాం !
డా. నాగసూరి వేణుగోపాల్