నేడు రాజకీయాలు కొనసాగించడానికీ, మలుపు తిప్పడానికీ ప్రధాన మార్గం న్యూస్ టెలివిజన్. ప్రస్తుతం టెలివిజన్ లేని రాజకీయరంగాన్ని ఊహించలేం. పాతికముప్ఫయి సంవత్సరాల కింద పాశ్చాత్య దేశాల్లో ఎన్నికల వేళ పార్టీ నాయకులు టెలివిజన్లో ప్రసంగిస్తారు, అదే ప్రచారం అని తెలుసుకున్నపుడు, అవునా,అలాగునా అని ముక్కున వేలేసుకుని సర్దుకున్నాం. నేడు కరపత్రాలు, పోస్టర్లు మాయమైపోయాయి.
ఇక్కడ ఇంకో విషయం గుర్తు చెయ్యాలి. 1998 ఫిబ్రవరి నాలుగవ తేదీ స్టార్ సంస్థ ఎన్నికల కోసం ఓ మూడు నెలల పాటు స్టార్ న్యూస్ ఛానల్ను ప్రారంభించింది. ఎన్నికల తర్వాత ఆపివేయడం లేదా ఆదరణ ఉంటే కొనసాగిద్దామన్న ఆలోచనతో కొన్ని కార్యక్రమాలను రూపొందించే బాధ్యతను ఎన్డిటివీకి అప్పగించింది. అప్పటి ప్రధాని ఐకె గుజ్రాల్ స్టార్ న్యూస్ను రిమోట్తో తన నివాసం నుంచే ప్రారంభించారు. ఎన్నికలు జరిగాయి. స్టార్ న్యూస్ ఆగలేదు సరికదా మరిన్ని ఛానళ్లు రావడానికి దారి తీసింది. అప్పటినుంచీ ఎన్నికల వేళ ప్రతిసారీ కొన్ని న్యూస్ ఛానళ్లు రావడం పరిపాటి అయింది.
ఈ రెండు దశాబ్దాలలో సుమారు నాలుగు వందల న్యూస్ ఛానళ్లు భారతదేశంలో బయలుదేరాయి. సరిగ్గా చెప్పాలంటే మొన్న జనవరి నాటికి 398 ఛానళ్లు. మొత్తం టివి ఛానళ్లలో ఇవి సుమారు సగభాగం అని అంచనా వేయవచ్చు. టివి9 వారి హిందీ న్యూస్ ఛానల్ ఈ ఆదివారం, అంటే మార్చి 31న మొదలయింది. టివి9 భారత్వర్ష్ అనే ఈ న్యూస్ ఛానల్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, ప్రసంగించారు. ఆ ప్రసంగ వేదిక న్యూస్ ఛానల్ వాహినిగా మారి కొనసాగింది. ఇటీవల బిబిసి తెలుగు విభాగం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రంగస్థలం పేరున కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ మొబైల్ ద్వారా లైవ్ ప్రసారాలు చేస్తోంది. వీటిలో రాజకీయనాయకులు పాల్గొంటారు. వీటిని స్టూడియోలో కాకుండా వేర్వేరు పట్టణాలలో నిర్వహిస్తూ సాగుతున్నారు. దీనికి ఎంచుకున్న పేరు రంగస్థలం చక్కగా ఉంది. మీడియానే ఎన్నికల రంగస్థలం. ప్రస్తుతం న్యూస్ టెలివిజన్ను ప్రధాన రంగస్థలంగా పరిగణించాలి. పత్రికలు ఒకవంక, ఫేస్బుక్, వాట్సాప్ వంటివి మరోవంక న్యూస్ టెలివిజన్కు దినుసులు అందించడమో, లేదా టివి కార్యక్రమాల విజువల్ బిట్స్ ప్రచారం చేయాడానికి దోహదపడడమో జరుగుతోంది. ఇటీవల ఒక విమర్శకుడు ఈ ఎన్నికలను వాట్సాప్ ఎన్నికలు అని పిలవాల్సిఉంటుందని పేర్కొనడం గమనార్హం.
ఏకకాలంలో ఎంతోమందిని చేరగలిగే సదుపాయం కల్పించిన టెక్నాలజీ ఫలితమిది. మంచినీ, ఆలోచననూ, సంస్కారాన్నీ, ఆరోగ్యకరమైన వినోదాన్నీ ఇచ్చే మీడియా రూపంగా జనావాసాల్లోకి బుల్లితెర ప్రవేశించింది. పలు ఛానళ్లు అయ్యాయి. రిమోట్ వచ్చింది. టెలివిజన్ ఛానల్ మొబైల్గా అరచేతిలో అమరిపోయింది. ఎవరు ఏస్థితిలో ఉన్నా చేరగలిగే సదుపాయం రాజకీయాలకు సరిగ్గా అతికింది కనుకనే నేడు రాజకీయనాయకులకు న్యూస్ ఛానళ్లు రావడమే కాదు, ఛానళ్ల జర్నలిస్టులు పొలిటీషియన్స్గా రూపుదాలుస్తున్నారు.
సమాజం గురించి తెలిసి ఉండాలి; జనుల ఆకాంక్షల గురించి అవగాహన కలిగి ఉండాలి; సవ్యంగా స్పందించాలి; చక్కగా వ్యక్తీకరించాలి అనే లక్షణాలు నేడు రాజకీయనాయకులకు అవసరం లేకుండా పోయాయి. కేవలం ఫెమీలియారిటీ పాపులారిటీగా స్థిరపడింది – మాటలు సరిగా మాటాడలేని వారూ, మొహం అనాకర్షణీయంగా ఉన్నవారూ బుల్లితెర మీద యాంకర్లుగా, విషయనిపుణులుగా స్థిరపడినట్లు. టివి పుణ్యమా అని కొత్త తరహా రాజకీయనాయకులు కూడా తప్పనిసరై పోయారు. ఇప్పుడు రాజకీయనాయకులలో ఎక్కువ భాగం టెలివిజన్కు అలవాటుపడి ప్రాచుర్యం పొందినవారే. అనర్గళంగా మాట్లాడగలగడం టెలివిజన్కు ఒక ప్రధాన అవసరం. కేవలం టీవి కారణంగా ప్రచారంలోకి వచ్చినవారు రాజకీయనాయకులైపోయారు. సినిమా నటుడని శివాజీ, మతప్రచారకుడని కెఎ పాల్ బుల్లితెరపై పదేపదే కనబడడానికి కారణం ఏమిటి? సోషల్ ఇంజనీరింగ్ లాగా ఎలక్షనీరింగ్ టెలివిజన్ తెరల ద్వారా సాగుతోంది. సభలు తగ్గిపోయి రోడ్షోలు పెరగడం టెలివిజన్ పుణ్యమే. ఐదేళ్ల తర్వాత టీవి ఛానళ్ల తీరు ఏమిటో తెలియదు కానీ నేటి రాజకీయాలకు కర్త కర్మ న్యూస్ టీవి ఛానల్గా మారిపోయింది. దానితో ఛానళ్లు నడిపేవారు రాజకీయనాయకులవుతారా, లేక రాజకీయనాయకులే ఛానళ్లు నడుపుతారా అని ఆలోచించాల్సివస్తోంది. రెండు వర్గాలూ యుద్ధం చేసుకుంటాయా? లేదా రెండు వర్గాలూ ఒకటిగా మారిపోతాయా? అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా బోధపడుతుంది. రెండు వర్గల ముసుగులు క్రమంగా తొలగిపోతున్నాయి.
-నాగసూరి వేణుగోపాల్