Chandrababu Naidu: గడచిన 2019 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎవరూ ఊహించని మెజార్టీతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వాల కాలపరమితి సగం దాటి పోయింది. అయితే ఇన్నాళ్లూ నైరాశ్యంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలలో అధికారం కోసం పావులు కదుపుతున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, మరియు బీజేపీ యేతర పార్టీలు, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ఇలా ఏ పార్టీలకు ఆ పార్టీలు అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మన రాష్ట్రం (ఏపి)లో రాజకీయాలు రోటీన్ గానే ఉన్నాయి. ఈ రెండు సంవత్సరాల్లో ఎలా ఉన్నాయో కేసులు, అరెస్టులు, అమరావతి రాజధాని ఇష్యూ, విశాఖ ఇష్యూ ఎలా ఉన్నాయో అలానే జరుగుతున్నాయి. అయితే జాతీయ స్థాయిలో మాత్రం వారానికి ఒక సంచలన అంశం బయటకు వస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికే) బీజేపికి బద్ద వ్యతిరేకిగా మారిపోవడం, కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధపడటం, ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడం, వీళ్లందరితో కాంగ్రెస్ పార్టీతో జత కట్టి మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలో రాకుండా చేయడానికి బీజేపీయేతర పార్టీలన్నింటీ ఏకం చేసే మహత్తర కార్యక్రమానికి పీకే శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ పాత్ర భిన్నమైనదిగా ఉంది.
ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ ఉనికిలో లేవు. ప్రాంతీయ పార్టీ టీడీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉండగా వైసీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు డైవర్ట్ అయ్యింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక వేళ పుంజుకుంటే ఆ ప్రభావం వైసీపీకి మైనస్ అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 35 శాతం ఓటు బ్యాంకు టీడీపీకి ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుండి డైవర్ట్ అయిన 35 శాతం ఓటు బ్యాంకు వైసీపీకి ఉంది. మిగిలిన 30 శాతం ఓటింగ్ న్యూట్రల్, టీచర్స్, విద్యాధికులు, ఉద్యోగులుగా ఉంది. 30 శాతం ఓటింగ్ ఎన్నికలకు ముందు నెల రోజుల ముందో లేక పది రోజుల ముందో ఒక నిర్ణయానికి వచ్చి ఓట్లు వేస్తారు. దాన్ని బట్టే ఎన్నికల ఫలితాలు మారిపోతుంటాయి. ప్రస్తుతం ఏపిలో ఏ రాజకీయ పార్టీ బలంగా ఉంది అని చెప్పడం కష్టమే. వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉండి ఉండవచ్చు కానీ న్యూట్రల్ ఓటింగ్ ను దూరం చేసుకున్నది. ఈ సంవత్సరన్నర కాలంలోనే న్యూట్రల్ (తటస్థ) ఓటింగ్ ను దూరం చేసుకుంది. ఉద్యోగులు, తటస్థులు, విద్యాధికులు, టీచర్లు వివిధ వర్గాల వారిని వైసీపీ దూరం చేసుకుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన పలు తప్పుల కారణంగా, వైసీపీలో ఉన్న బలహీనతల కారణంగా ఈ వర్గాలు దూరం అయ్యారు. అందుకు మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను చూసుకుంటే రెండు సమ ఉజ్జీలుగానే ఉన్నాయని చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ ప్రాంతీయ పార్టీలను తమతో కలుపుకోవాలని చూస్తుండగా ఏపిలో ఏ ప్రాంతీయ పార్టీని చూజ్ చేసుకోవాలనే దానిపై వాళ్లు ఓ సర్వే చేయించగా వైసీపీ బలహీనపడిందని తేలింది. కేంద్ర అనుబంధ ఇంటెలిజెన్స్ నిఘా రిపోర్టులో కూడా వైసీపీ బలహీన పడిందని, దాదాపు 60 స్థానాలు కోల్పోనుందని నివేదిక వచ్చిన్నట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ టీమ్ చేసిన సర్వే లో కూడా అదే తేలింది. 2019 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ బలహీనపడిందని వాళ్లకు తెలిసిపోయింది. జిల్లాల వారీగా, నియోజకవర్గాలవారీగా కూడా మీడియా సంస్థలవద్ద లెక్కలు ఉన్నాయి. సో..వైసీపీ బలహీనపడింది కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా కనబడేది తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఒంటరిగా ఎదిగే పరిస్థితి లేదు. ఒంటరిగా వైసీపీని ఢీకొట్టడం కష్టమే. అందుకే జనసేన తో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీ నెగ్గే ఆలోచన చేస్తుందని ఒక ప్రచారం జరుగుతోంది.
అలాగే జాతీయ స్థాయిలో సర్వేలోనూ ఇవి తెటతెల్లమవుతున్నాయి. అందుకే వైసీపీని పక్కన పెట్టి టీడీపీని తమ కూటమిలో కలుపుకోవాలని ప్రశాంత్ కిషోర్ టీమ్ కలుపుకోవాలనేది ఒక ప్రతిపాదన. నిజానికి 2018 తెలంగాణ ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీతో చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలంగాణలో కలిసి పోటీ చేశారు. కానీ తెలంగాణలో వారు అనుకున్న రిజల్ట్ రాలేదు. అయితే అక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనే కంటే టీఆర్ఎస్ హవా తెలంగాణ సెంటిమెంట్ అనుకోవాలి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు తెలంగాణలో లేవు, ఆంధ్రప్రదేశ్ లో నూ లేవు. అందుకని ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేది కాకుండా 2019 ఎన్నికల్లో ఎలాగైతే బీజేపీ యేతర పార్టీలను కూటమిగా చేసే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు ముందుకు వచ్చి మమతా బెనర్జీ, శరద్ పవార్, కేజ్రీవాల్ తదితరులను రాహుల్ గాంధీతో కలుపుకుని ముందుకు సాగారో ఇప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలో అదే రకంగా పావులు కదిపితే ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారుట. ఆరు నెలల కాలం పాటు చంద్రబాబు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఉంటే సీనియర్ నేతలు అందరితో ఆయన మంతనాలు జరిపితే చంద్రబాబు మాటలు అయితే వీరంతా వింటారని టాక్. జాతీయ స్థాయిలో అనుభవజ్ఞుడు చంద్రబాబు గతంలో జాతీయ స్థాయిలో కూటమికి నేతృత్వం వహించినందున ఇప్పుడు కూడా బీజేపీ వ్యతిరేక కూటమికి కన్వీనర్ గా ఉంటే బాగుంటుంది అనేది ప్రశాంత్ కిషోర్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా మంతనాలు జరిపేందుకు వార భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి.