గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్కు అధికార వైసిపి నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. గుంటురు జిల్లా అభివృద్ధి సమీక్షా (డిఆర్సి) సమావేశాలకు లోకేష్ను ఆహ్వానించకూడదని తీర్మానం చేశారు. సిఎం జగన్ ఒక సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ వ్యాఖ్యలను వైసిపి ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.
శనివారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో డిఆర్సి సభ్యుడిగా ఉన్న లోకేష్ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో లోకేష్కు డిఆర్సి నుండి బహిష్కరణ వేటు పడింది. ఈ సమావేశంలో ఇన్చార్జి మంత్రి రంగనాధ్రాజు, మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకట రమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
నారా లోకేష్ను డిఆర్సి నుండి బహిష్కరించడంపై టిడిపి మహిళా నేత పంచుమర్తి అనురాధ ఘాటుగా స్పందించారు. ’కరకట్ట కాలకేయ ప్రతిపాదించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జై కొట్టారు.’ అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఉరి తీయాలి, నడిరోడ్డుపై కాల్చాలి అంటూ మాట్లాడినప్పుడు ఈ కరకట్ట కాలకేయ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారని అనురాధ ప్రశ్నించారు. కరకట్ట కమల్ హాసన్ ఎవర్నో కాపాడాలని ఏదో ప్లాన్ చేస్తున్నారని ఆమె అన్నారు. డిఆర్సి సమావేశాలకు లోకేష్ను పిలవకూడదని నిర్ణయం తీసుకున్నారంటే లోకేష్ అంటే వారు ఎంత భయపడుతున్నారో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. డిఆర్సి సమావేశాలకు పిలవకుండా అడ్డుకోగలరేమో గానీ ప్రజల్లో పెరుగుతున్న మద్దతును అడ్డుకోవడం వారి తరం కాదని అనురాధ అన్నారు.
ఆ రోజు నొప్పి తెలియలేదా? డిఆర్సీ సమావేశాలు @naralokesh ని పిలవకూడదు అన్న మీ నిర్ణయంతోనే @naralokesh అంటే మీకు ఎంత భయమో బయటపెట్టుకున్నారు. డిఆర్సీ సమావేశాలకు పిలవకుండా అడ్డుకోగలరు ఏమో? @naralokesh కి ప్రజల్లో పెరుగుతున్న మద్దత్తు ని అడ్డుకోవడం మీ తరం కాదు.
— PANCHUMARTHY ANURADHA TDP #StayHomeSaveLives (@AnuradhaTdp) November 23, 2019