ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అధికార టిడిపి కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతుందని వైసిపి ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ కమిషన్తో సమావేశమయ్యారు. టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు.
అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఐటి, సిబిఐని రాష్ట్రంలోకి అనుమతించమని చెప్పిందనీ, ఇప్పుడు స్వతంత్ర రాజ్యంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చంద్రబాబు ఖాతరు చేయటం లేదనీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దీనికి మూల కారకులు డిజిపి ఆర్పి ఠాకూర్ అని ఆయన ఆరోపించారు.
ఠాకూర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనీ, టిడిపికి అనుకూలంగా పనిచేసేలా పోలీసు యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. ఠాకూర్ను తక్షణం బదిలీ చేయాలనీ, లేని పక్షంలో రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరగవనీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని విజయసాయి రెడ్డి చెప్పారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అదే విధంగా కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రభుత్వం పసుపు-కుంకుమ పథకం కింద నేరుగా మహిళ ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్న వైనంపై కూడా ఫిర్యాదు చేశామన్నారు.
అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై కూడా విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. కేఏ పాల్ చంద్రబాబుతో లాలూచి పడ్డారనీ, డబ్బులకోసం చంద్రబాబుకు అమ్ముడు పోయారనీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. అందుకే వైసిపి అభ్యర్థులకు ఉన్న పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేశారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.