అమరావతి: శాసన మండలిని రద్దు చేయాలని తాను సీఎం జగన్ ను గట్టిగా కోరుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా శాసన మండలి విలువలు దెబ్బతిన్నాయని అన్నారు. పెద్దల సభ సలహాలు ఇచ్చే విధంగా వుండాలి, కానీ వివాదం సృష్టించే విధంగా వుండరాదన్నారు. మండలి గ్యాలరీల్లో కూర్చుని, చైర్మన్ ను బెదిరించి, తనకు అనుకూలంగా వ్యవహరించేలా చంద్రబాబు ప్రయత్నించారని రోజా ఆరోపించారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన పెద్దల సభ ఇలా అభివృద్ధిని అడ్డుకుంటుంటే ఆ సభ ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో కొన్న భూములను కాపాడుకునేందుకే ఉద్యమాన్ని లేవదీశారని ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపించితే శాసన మండలి లో ఆలస్యం చేయటం సరికాదన్నారు.
“ఈరోజు లోకేశ్ తీరు చూస్తుంటే, చాలా విచిత్రంగా అనిపిస్తోంది. బయటకు వచ్చి, ఏదో సాధించేసినట్టు… శాసనమండలిని రద్దు చేస్తారా? దమ్ముంటే చేయండి అంటున్నారు. బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్లి తొడగొడితే ఏమవుతుందండీ? కోసి ఉప్పూ, కారం పెట్టి, కూర వండేస్తారు. ఆ విషయాన్ని లోకేశ్ తెలుసుకుంటే మంచిది. ఇంకో మహా మేధావి ఉన్నాడండీ… యనమల రామకృష్ణుడు. ప్రజల తీర్పు ఏంటి? ఆయన్ను రెండుసార్లు, ఆయన తమ్ముడిని రెండు సార్లు ప్రజలు ఓడించడాన్ని మనం చూశాం. ప్రజలు అసహ్యించుకున్న ఈయన, ప్రపంచ మేధావిలాగా ఫీల్ అవుతూ, ప్రజా తీర్పును అవమానించేలా మండలిలో ప్రవర్తిస్తున్నారు” అని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.