కొలంబో (శ్రీలంక) భద్రతా దళాల ఎదురుకాల్పుల నేపథ్యంలో ఉగ్రవాదులు తమకు తాము పేల్చుకుని (ఆత్మాహుతి) మృతి చెందారు.
కొలంబోలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల అనుమానితుల కోసం పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సమ్మంతురై అనే ప్రాంతంలో ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో దాగి ఉన్నారని సమాచారంతో భద్రతా బలగాలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నాయి. పోలీసుల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య కాసేపు ఎదురుకాల్పులు జరిగాయి, ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లతో వారు పేల్చుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో 15 మంది చనిపోయినట్లు శనివారం అధికారులు మీడియాకు తెలిపారు. వీరిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు చిన్నారులు ఉన్నారు.
ఈ స్థావరం నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
మృతిచెందిన వారు నేషనల్ తౌవీద్ జమాత్కు చెందిన ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
దేశంలో దాదాపు 140 మంది ఐసిస్ అనుమానితులు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 76మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరిలో సిరియా, ఈజిప్టునకు చెందినవారు కూడా ఉండడం గమనార్హం.
మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈస్టర్ పండుగ సందర్బంగా కొలంబోలో ఈ నెల 21న చర్చిలు, హోటల్స్లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో దాదాపు 250మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.