(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో సంచలనం సృష్టించిన సమత హత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. గురువారం నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ ముగ్దుంలను కోర్టు విచారించనుంది. నిందితుల తరపున న్యాయవాది రహీం వాదనలు వినిపించనున్నారు. సోమవారం(డిసెంబర్ 16) నుంచి సమత కేసు దర్యాప్తు కోసం హైకోర్టు ప్రత్యేకంగా నియమించిన ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపటార్లో నవంబర్ 24న సమత హత్యాచారానికి గురైంది. బెలూన్లు అమ్ముకుని జీవించే సమత సాయంత్రం ఒంటరిగా ఇంటికి వస్తున్న సమయంలో అడ్డగించిన నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం సత్వర విచారణకు ఆదిలాబాద్ జిల్లా, అదనపు సెషన్స్ కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేసింది. కాగా, నేటి విచారణ సందర్భంగా సాక్షుల విచారణ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది.
ఘటన అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో బాధితురాలి పేరును గోప్యంగా ఉంచాలని ఆదేశించిన పోలీసులు ఆమె పేరును ‘సమత’గా సంబోదించాలని సూచించారు. బాధితురాలిపై అత్యాచాం అనంతరం, గొంతుకోసి చంపినట్లు పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లోనూ ఈ విషయం ధ్రువీకరణ అయినట్లు తేలింది. సమత కేసులో నిందితులను ఉరి శిక్ష విధించాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు.