న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా దాఖలు చేసిన పిటిషన్పై తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్ లిస్ట్ చేయాలని జస్టిస్ రమణ ఆదేశించారు.
పూనవాలా తరపున బెంచ్ ముందు హాజరయిన న్యాయవాది సుశీల్ మాలిక్, తాను ఆర్టికల్ 370 గురించి మాట్లాడబోననీ, రాష్ట్రంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించాల్సిన అవసరం ఉందనీ అన్నారు. ప్రజలు కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటారనీ, తమ వారి క్షేమ సమాచారాలు తెలుసుకునే హక్కు వారికి ఉందనీ ఆయన అన్నారు.
(11 :17 గంటలు) అంతకుముందు:
కశ్మీర్ లోయ దిగ్బంధాన్ని సామాజిక కర్యకర్త తెహసీన్ పూనావాలా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కశ్మీర్ ప్రభుత్వం సోమవారం అరెస్టు చేసిన మాజీ ముఖ్యమంత్రుల విడుదలకు కూడా ఆదేశాలు జరీ చేయాలని ఆ పిటిషన్లో కోరారు.
ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ విభజన దరిమిలా అక్కడి ప్రజల నుండి ఎదురవ్వగల నిరసనలను అణచివేసే చర్యలలో భాగంగా కశ్మీర్లో కర్ఫూ విధించారు. రాష్ట్రమంతా కమ్యూనికేషన్లను నిషేధించారు. ప్రస్తుతం కశ్మీర్లో మొబైల్ ఫోన్లు గానీ, ఇంటర్నెట్ గానీ లేవు.
జమ్ము కశ్మీర్లో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు న్యాయ విచారణ సంఘం ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21ని ఉల్లంఘిస్తున్నాయని పూనావాలా తన పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో 40 వేల మందికి పైగా కేంద్ర భద్రతా బలగాలు ఉన్నారు.