ఇస్లామాబాద్: దౌత్య, వాణిజ్య సంబంధాల కుదింపు నిర్ణయాన్ని పునపరిశీలించాల్సిందిగా ఇండియా పాకిస్థాన్ను కోరింది. ఇస్లామాబాద్లోని భారత రాయబారిని బహిష్కరించడంతో పాటు పాకిస్థాన్ ప్రభుత్వం ఇరు దేశాల సంబంధాల స్థాయు కుదింపు ప్రకటించింది.
ఇండియా దీనిపై వెంటనే స్పందించింది. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ప్రపంచ దేశాలకు ఆందోళనకరమైన సంకేతాలు పంపడం పాకిస్థాన్ ఉద్దేశమని ఇండియా పేర్కొన్నది. సంబంధాల కుదింపునకు పాకిస్థాన్ చెప్పిన కారణాలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 కి సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు పూర్తిగా ఇండియా ఆంతరంగిక విషయమని ప్రభుత్వం పేర్కొన్నది.
(10: 35 గంటలు) అంతకుముందు:
కశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసినందుకు పాకిస్థాన్ మొదటి ప్రతిచర్య ప్రకటించింది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషనర్ను బహిష్కరించింది. దానితో పాటు ఇండియాతో దౌత్య సంబంధాల స్థాయి కుదింపు, ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేత సహా మరి కొన్ని చర్యలు ప్రకటించింది.
భారత ప్రభుత్వ నిర్ణయాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేయనున్నట్లు కూడా పాకిస్థాన్ ప్రకటించింది. కశ్మీర్ వివాదంపై తృతీయపక్షం జోక్యాన్ని పాకిస్థాన్ మొదటినుంచీ కోరుకుంటోంది. ఇండియా దీనిని వ్యతిరేకిస్తోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహిస్తానని అన్నపుడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. ఇండియా వ్యతిరేకించింది.
పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీతో ఇమ్రాన్ ఖాన్ సమావేశమయిన తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం ట్విట్టర్లో ఈ చర్యలు ప్రకటించింది. ద్వైపాక్షిక ఒప్పందాలు సమీక్షిస్తామనీ, ఆగస్టు 5 నుంచి 14 వరకూ కశ్మీరీలకు సంఘీభావం ప్రకటిస్తామనీ తెలిపారు.
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ చర్యలు అక్కడ మానవహక్కుల పరిస్థితిని దిగజారుస్తాయని ఆందోళనగా ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కశ్మీర్ నుంచి సమాచారం ఏమాత్రం బయటకురావడం లేదన్న విషయమే ఆందోళనకరమని సమితి ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.