న్యూఢిల్లీ: జాతీయ రహదారులు వాహనాలు వెళ్లేందుకే కాదు.. విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకు కూడా ఉపయోగపడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో అకస్మాత్తుగా ఓ విమానం ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన గురువారం ఉత్తర్ ప్రదేశ్లోని ఘజియాబాద్ హైవేపై చోటు చేసుకుంది. పైలట్లకు శిక్షణ ఇచ్చే ఎన్సీసీకి చెందిన ట్రైయినింగ్ ఎయిర్క్రాఫ్ట్ గాలిలోకి ఎగిరింది. ఇంతలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఘజియాబాద్లోని సదర్పూర్ వద్ద ఉన్న ఎక్స్ప్రెస్వే పై ఎమర్జెన్సీ లాండింగ్ అయ్యింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. విమానం రెక్క విరిగిపోయినా పైలట్లు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే సాంకేతికలోపం తలెత్తడంతో విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని చూసేందుకు పెద్దఎత్తున ఆ గ్రామ ప్రజలు తరలి వచ్చారు. హైవేపై విమానం ల్యాండ్ కావడంతో కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇదిలావుండగా విమానాలు టేకాఫ్ తీసుకోగానే ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు ఈ హైవేలపై ల్యాండ్ అయ్యేలా కొన్నిటిని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో హైవేలు కూడా రన్వేలా ఉపయోగపడేలా ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. మిలటరీ విమానాలు లేదా ఇతర చిన్న విమానాలు ల్యాండ్ అయ్యేలా తీసుకున్నారు. గతంలో యుమునా ఎక్స్ప్రెస్వే పై ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఫైటర్ జెట్ ల్యాండ్ అయింది.