అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజే సభ ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లింది. రాష్ట్రంలో కరవు, నీటి ఎద్దడి సమస్యలు ప్రస్తావనకు వచ్చినపుడు, గత ప్రభుత్వం పాలనను ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు. దానివల్లనే నేటికీ రైతులు ఇక్కట్లు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ ఆరోపణలను ప్రధాన ప్రతిపక్షం తిప్పికొట్టింది.
గత ప్రభుత్వం 2300కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ ఎగ్గొట్టి రైతులను మోసం చేసిందని జగన్ ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు సహాయం రూపంలో గతంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు. విత్తనాల సేకరణ కూడా చేయలేని పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిందని జగన్ మండిపడ్డారు. గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా రైతులకు బకాయిలు పెట్టారని జగన్ అన్నారు. రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని జగన్ చెప్పారు. వడ్డీ వ్యాపారుల నుండి రైతులను కాపాడేందుకు పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోపుగా చెల్లిస్తే వడ్డీ పూర్తిగా రాయితీ ఇవ్వడం జరుగుతుందనీ జగన్ అన్నారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నామని జగన్ ప్రకటించారు.
తాగునీటి సమస్య తక్షణ పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున కేటాయిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పర్యటించి నీటి ఎద్దడి తెలుసుకోవాలని జగన్ సూచించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తడానికి టిడిపి అసమర్థ పాలనే కారణమని మంత్రి బొత్సా సత్యనారాయణ విమర్శించారు.
అధికార పక్షం గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మాట్లాడటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యే కె అచ్చెన్నాయుడు తదితరులు ప్రతి విమర్శలకు దిగారు. టిడిపి శాసనసభాపక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు సున్నా వడ్డీ పథకం కొత్తదేమీ కాదని వ్యాఖ్యానించడంతో సభలో దుమారం చెలరేగిఁది. ఈ పథకం గతంలో కిరణ్కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారనీ, తమ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించిందని ఆయన అన్నారు. దీనిపై జగన్ జోక్యం చేసుకొని టిడిపి విమర్శలు తప్పని రుజువు చేస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.
2014 నుండి 2019వరకూ రైతాంగానికి గత టిడిపి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకంపై రూపాయి కూడా ఇవ్వలేదనీ, అవసరమైతే రికార్డులు తీసుకొస్తానని జగన్ అన్నారు. సున్నా వడ్డీ కింద రైతాంగానికి ఎంత ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. దీంతో సభలో వాగ్వివాదం చోటుచేసుకుంది.
జగన్ సవాల్పై చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాతనంతో మాట్లాడాలని అన్నారు. ముఖ్యమంత్రి లెక్కలేనితనంతో మాట్లాడటం మంచిది కాదని చంద్రబాబు అన్నారు. అసత్యాలు మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. కనీసం వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా అవమానిస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్ హయాంలో 14500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరికీ ఏడు లక్షల రూపాయలు కాదు పది లక్షల రూపాయలు ఇవ్వండి, చెప్పుకోండి అని చంద్రబాబు అన్నారు.