అమరావతి:పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో కోర్టు స్టే అమలులో ఉంది. మరోపక్క కేంద్రం దీనిపై దృష్టి సారించింది. నివేదిక కోరింది. ఒక పక్క ఆ నివేదిక పంపే ప్రయత్నం చేస్తూనే, మరోపక్క కాంట్రాక్టు రద్దునూ, రీటెండరింగ్ ప్రక్రియను బుధవారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వంలో ఆర్టిసి కార్మికుల విలీనం, కొత్త ఇసుక విధానంతో సహా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆర్టిసిలో పని చేస్తున్న 53వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58నుండి 60కి పెరగనుంది. కొత్త ఇసుక విధానం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఇసుక ధరను టన్ను 375 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 58 ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏపిఎండిసి ద్వారా ఆన్ లైన్లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాజకీయ ప్రమేయం లేకుండా ఇసుక రీచ్లను నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. దశల వారిగా ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్లు పెంచాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా పూర్తిగా నిషేదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది.
నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3216.11 కోట్ల రూపాయల టెండర్ రద్దుకు, రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టర్కు ఇచ్చిన అడ్వాన్స్ల రికవరీ చేయాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది.
మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు, ఆశా వర్కర్ల వేతనం మూడు వేల రూపాయల నుంచి పది వేలకు పెంపు.మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పథకం ప్రారంభం. దీని కింద జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించే క్రీడాకారులకు అయిదు లక్షల రూపాయలు, సిల్వర్ మెడల్ సాధిస్తే నాలుగు లక్షల రూపాయలు. కాంస్య పతకం సాధిస్తే మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుల సంఖ్యను 18 నుంచి 24 కు పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 38 అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.