అమరావతి: ఈవిఎంలపై పోరాటం సాగిస్తున్న ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి ‘ క్రికెట్లో అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్ను తప్పుబట్టినట్లుగా ‘ఉందని ప్రధాని మోది ఎద్దేవా చేస్తూ విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై అదే స్థాయిలో చంద్రబాబు శనివారం ట్విట్టర్ వేదికగా ప్రతివిమర్శలు చేశారు.
మే 23న దేశ ప్రజలు ప్రధానిగా అతని టీమ్ను తిరస్కరించడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ టీమ్కు పరజయం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్ను ప్రజలే ఎంపిక చేసుకుంటారనీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారని చంద్రబాబు క్రికెట్ భాషలోనే ప్రతి విమర్శ చేస్తూ ట్వీట్ పోస్టు చేశారు.
రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా మోది వెనుకాడరనీ, రక్షణశాఖను, సైనాన్యీ వాడుకుంటారని చంద్రబాబు ఆరోపించారు. ‘మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతి పన్నాలు ప్రబోధిస్తారు’. అంటూ చంద్రబాబు విమర్శించారు.
ఎన్నికల షెడ్యూల్కు 73 రోజులు తీసుకున్న ఎన్నికల సంఘానికి 50శాతం వివి ప్యాట్ల లెక్కింపుకు మరో ఆరు రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘నరేంద్ర మోది ఎందుకు భయపడుతున్నారు..? 50శాతం వివి ప్యాట్లు లెక్కించాలని ఈసిని ప్రతిపక్షాలు అడిగితే మోదికి ఏం సంబంధం, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు.’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
తమ పోరాటం భారత ఎన్నికల సంఘంపై కాదనీ, అధికారుల వివక్షత, పక్షపాత ధోరణిపనే అని చంద్రబాబు అన్నారు. మోది, అమిత్షాలపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఈసి అమలు చేయకపోవడంపైనే తమ పోరాటమని చంద్రబాబు స్పష్టం చేశారు.