అమరావతి: సర్వేలన్నీ తప్పేనని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో టిడిపి వంద శాతం విజయం సాధిస్తుందని ఆయన సోమవారం అమరావతిలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సర్వేలను నమ్మొద్దనీ, తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలే తమను గెలిపిస్తున్నాయనీ ఆయన చెప్పారు. వోటు వేయండంటూ తాను వీడియో సందేశం ద్వారా పిలుపు ఇవ్వడంతో ప్రజలు మధ్యాహ్నం తర్వాత వచ్చి బారులు తీరారని ఆయన అన్నారు. సర్వేలు గతంలోనూ లెక్క తప్పాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
ఎన్నికల కమిషన్ పూర్తిగా పక్షపాతంతో వ్యవహరించిందని చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ చివరిరోజు ప్రధాని నరేంద్ర మోదీ కేదారనాధ్ వెళ్లడం కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఆయన అన్నారు. వివిప్యాట్ స్లిప్పులు కనీసం 50 శాతం లెక్కించాలన్న తమ డిమాండ్లో మార్పు లేదని చంద్రబాబు చెప్పారు.
వోటింగ్ యంత్రం లెక్క వివిప్యాట్ స్లిప్పుల లెక్క సరిపోలకపోతే వివిప్యాట్ లెక్కను పరిగణిస్తామని ఎన్నికల కమిషన్ అంటున్నదని పేర్కొంటూ, అది సరి కాదనీ, అలాంటి సందర్బంలో మొత్తం వివిప్యాట్ స్లిప్పులు లెక్కించాలనీ చంద్రబాబు అన్నారు.