అమరావతి: డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డు పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాల కింద మార్పు చేయడంపై వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ జివో విడుదల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జివోను రద్దు చేయాలనీ, యధాతథంగా అబ్దుల్ కలాం పేరుతోనే ప్రతిభా పురస్కార్ అవార్డులను కొనసాగించాలని జగన్ అదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అదే విధంగా మహాత్మాగాంధీ, అంబేద్కర్, పూలే, జగజ్జీవన్రామ్ వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని కూడా జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంక్షేమ పథకాలకు పాత పేర్లు తొలగించి కొత్త పేర్లు తగిలించి అమలు చేయడం సర్వసాధారణమైపోయింది. గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టిఆర్ ఆరోగ్య శ్రీగా మార్పు చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత దాని పేరును వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీగా మార్చారు. ఇదే మాదిరిగా చాలా పథకాలకు పేర్ల మార్పు జరుగుతోంది.
అయితే తాజాగా ప్రభుత్వం దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డు పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాల కింద మార్పు చేశారు. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు జివో విడుదల చేశారు. అయితే ఈ ప్రతిభా పురస్కారం పేరు మార్పుపై పలువురు ఆక్షేపణలు వ్యక్తం చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత బిజెపి నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అబ్దుల్ కలాం గారి పేరుపై అందిస్తున్న ప్రతిభా పురస్కారాలను వైయస్సార్ గారి పేరుతో మార్పు చేయటం దురదృష్టకరమని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ గారిని గౌరవించు తలుచుకుంటే వారి పేరు పైన నూతనంగా కార్యక్రమాన్ని ప్రారంభించటం సబబుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యాపరమైన ఈ పురస్కారాలకు అబ్దుల్ కలాం గారి పేరే సముచితంగా ఉంటుందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
పలువురు మేధావులు కూడా విద్యా పురస్కారానికి సంబంధించి అబ్దుల్ కలాం పేరు మార్పు చేయడంపై ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాం పేరుతోనే ప్రతిభా పురస్కారాలను కొనసాగించాలని జగన్ ఆదేశించారు.
అబ్దుల్ కలాం గారి పేరుపై అందిస్తున్న ప్రతిభా పురస్కారాలను వైయస్సార్ గారి పేరుతో మార్పు చేయటం దురదృష్టకరం. వైయస్సార్ గారిని గౌరవించు తలుచుకుంటే వారి పేరు పైన నూతనంగా కార్యక్రమాన్ని ప్రారంభించటం సబబు. విద్యాపరమైన ఈ పురస్కారాలకు అబ్దుల్ కలాం గారి పేరే సముచితంగా ఉంటుంది. pic.twitter.com/GqS6o1m8A1
— IYRKRao , Retd IAS (@IYRKRao) November 5, 2019