అమరావతి: ఏపీలో బార్లకు సంబంధించి కొత్త మద్యం పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మద్యం పాలసీపై బార్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. కొత్త బార్ల మంజూరుకు తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు తెలిపింది. యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నూతన మద్య విధానంలో భాగంగా ఇప్పటికే వైన్ షాపుల్ని20 శాతం తగ్గించింది. అంతేకాకుండా ప్రభుత్వమే మద్యం విక్రయాలు నిర్వహిస్తోంది. మద్యం ధరలను కూడా భారీగా పెంచేసింది. ఇప్పుడు బార్ల సంఖ్య తగ్గించేందుకు కూడా సిద్ధమైంది. గత నెలలో ఏపీ ప్రభుత్వం బార్ల లైసెన్సులు రద్దు చేసింది. కొత్త బార్ల విధానంలో భాగంగా ప్రస్తుతం ఉన్న బార్ల మూసివేతకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో బార్లు మూతపడ్డాయి. అలాగే కొత్త బార్ పాలసీని ప్రకటించింది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నూతన బార్ల విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఆ పాలసీ ప్రకారం బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. ఆ డిపాజిట్ కూడా నాన్ రిఫండబుల్. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ ఏర్పాటుకు రూ.25 లక్షలు, ఐదు లక్షల్లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ.50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో రూ.75 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. బార్ షాపులను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బార్లు నడుస్తాయి. రెండేళ్ల కాలపరిమితితో లైసెన్స్ జారీ చేస్తారు. దీంతో బార్ల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.