(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్కు క్షమాపణ చెప్పిన తర్వాత వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. మరి వంశీ ఏం చెయ్యబోతున్నారు. వైసిపిలో చేరడం ఖాయం అయిందన్న విషయం మళ్లీమళ్లీ చెప్పుకోనక్కర లేదు. అయితే రాజీనామా దగ్గరే పేచీ వస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందే తాము టిడిపి లాగా కాదనీ, రాజీనామా చేయందే ఎవరినీ పార్టీలోకి తీసుకోబోమనీ నొక్కి చెప్పారు. ఇప్పుడు మరి వంశీ విషయంలో ఏం చేస్తారు. మొన్న ఢిల్లీలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాతో చెప్పిన మాటలే దీనికి జవాబని అంటున్నారు.
వంశీ అయినా మరెవరైనా రాజీనామా చేయందే పార్టీ మార్పిడి సహించేది లేదని స్పీకర్ పేర్కొన్నారు. టిడిపి నాయకత్వం వంశీని పార్టీ నుంచి తొలగిస్తే ఆయనకు స్వతంత్రం లభించినట్లని కూడా స్పీకర్ వ్యాఖ్యానించారు. వంశీ విషయంలో జరుగుతున్నది ఇదేనని టిడిపి వర్గాలు అంటున్నాయి. వైసిపిలో నేరుగా చేరకుండానే ఆ పార్టీ మనిషిగా వ్యవహరిస్తారని అంటున్నారు.
వంశీ తమపై మరీ దూకుడుగా వెళ్లాడనీ, అమ్మాయిలతో ఉన్న ఫొటోలు బయటకు వచ్చేసరికి దూకుడు కాస్త తగ్గిందనీ ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి వంశీ వాట్సాప్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి రాజీనామా పంపిన రోజుకూ ఈ రోజుకూ చాలా తేడా వచ్చింది. తనను వైసిపి ప్రభుత్వం వేధిస్తోందనీ, కార్యకర్తలను కాపాడుకోవడానికి పార్టీ మారుతున్నాననీ వంశీ చెప్పినపుడు చంద్రబాబు వంశీని అనునయించేందుకు ప్రయత్నించారు. తమ నాయకుడు వంశీ విషయంలో చాలా అమాయకంగా మోసపోయారని టిడిపి వర్గాలు అంటున్నాయి. వైసిపి వేధిస్తోందన్న మాటే నిజం కాదనీ, రానున్న అయిదేళ్లు కూడా అధికారప్రాభవం అనుభవించడానికే వంశీ పార్టీ వదిలారనీ వారు ఆరోపిస్తున్నారు. ఈ వారం పది రోజుల్లో వంశీ ధోరణి ఎన్ని సార్లు మారిందో చూస్తేనే అసలు సంగతి తెలిసిపోతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.