(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీ దిశ చట్టం 2019పై ఢిల్లీ సర్కారు ఆసక్తి కనబరిచింది. దిశ చట్టం కాపీ తమకు పంపాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు కేజ్రీవాల్ సీఎం జగన్కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏపీ దిశా చట్టంపై సర్వత్రా ప్రసంశలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయంశంగా మారింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సీఎం జగన్ ను అభినందించారు. తాజాగా జగన్ నిర్ణయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంశల వర్షం కురిపించారు. జగన్ నిర్ణయం భేష్ అంటూ ఆయన లేఖ కూడా రాసారు. మహిళలపై దాడుల నిరోధించడానికి దిశ చట్టం తేవడంపై ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దిశ చట్టానికి సంబంధించిన బిల్లును పంపాలని ఆయన జగన్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి చట్టాలతో బాధితులకు న్యాయం జరుగుతుందని లేఖలో కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
కాగా, ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టంపై హర్షం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఈ చట్టంపై తన అభిప్రాయం తెలిపారు. దిశ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు వేగంగా న్యాయం జరుగుతుందన్న వెంకయ్య.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు చాలా అవసరమని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా జగన్ నిర్ణయంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో దిశా హత్యాచార నిందితులను ఆ రాష్ట్ర పోలీసులు కాల్చి చంపినా కొందరిలో మార్పు రావడం లేదు. ఏపీలోనూ దిశా చట్టం ప్రవేశ పెట్టిన తర్వాత కూడా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి.
గత శుక్రవారం(డిసెంబర్ 13) ఏపీ శాసనసభ ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా యాక్ట్- 2019, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019కు ఆమోద ముద్ర వేసింది. ఏపీ దిశ యాక్ట్ ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తిపై 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి… సరైన ఆధారాలు ఉంటే… 21 రోజుల్లో శిక్షను అమలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై తీవ్ర నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడుతుంది. సోషల్ మీడియా లేదా ఫోన్లలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు.