లక్నో: బీజేపీ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో పలువురు సిట్టింగులకు మొండిచేయి ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లో అయితే కేంద్ర మంత్రి కృష్ణరాజ్ సహా ఆరుగురు ఎంపీలకు ఈసారి టికెట్లు ఇవ్వలేదు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రాంశంకర్ కఠేరియా కూడా ఈసారి బెంచికే పరిమితమయ్యారు. ప్రధామంత్రి నరేంద్రమోదీ వారణాసి నుంచి, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లక్నో నుంచి బరిలోకి దిగుతున్నారు. స్మృతి ఇరానీ మరోసారి కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహల్ గాంధీని ఢీకొనబోతున్నారు. షాజహాన్ పూర్ ఎంపీ, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కృష్ణరాజ్, ఆగ్రా ఎంపీ రాం శంకర్ కఠేరియా, హర్దోయ్ ఎంపీ అన్షుల్ వర్మ, ఫతేపూర్ సిక్రీ ఎంపీ బాబూలాల్ చౌదరి, మిసిర్ఖ్ ఎంపీ అంజు బాలా, సంభల్ ఎంపీ సత్యపాల్ సింగ్.. ఈ ఆరుగురికి ఈసారి టికెట్లు దక్కలేదు. వాళ్లకు బదులుగా ఆగ్రాలో ఎస్పీ సింగ్ బాఘెల్, సంభల్ లో పరమేశ్వర్ లాల్ సైనీ, ఫతేపూర్ సిక్రీలో రాజ్ కుమార్ చాహర్, హర్దోయ్ లో జైప్రకాష్ రావత్, మిసిర్ఖ్ లో అశోక్ రావత్, షాజహాన్ పూర్ లో అరుణ్ సాగర్ కొత్తగా టికెట్లు దక్కించుకున్నారు.
గత ఎన్నికలలో వారణాసిలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ప్రధాని నరేంద్రమోదీ 3.8 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో ఓడించారు. లక్నోలో రాజ్ నాథ్ సింగ్ కు 5.6 లక్షల ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిని రీటా బహుగుణ జోషి కేవలం 2.7 లక్షల ఓట్లు తెచ్చుకోగలిగారు. అమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కొత్తగా టికెట్లు తెచ్చుకున్నవారిలో కేంద్ర మంత్రులు వీకే సింగ్ (ఘజియాబాద్), సత్యపాల్ సింగ్ (బాఘ్ పత్), మహేశ్ శర్మ (గౌతమబుద్ధ నగర్) తదితరులున్నారు. యూపీలో మొత్తం 7 దశల్లోనూ పోలింగ్ జరగనుంది. తొలివిడత ఏప్రిల్ 11వ తేదీన ఉంటుంది. మే 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.