న్యూఢిల్లీ: కురువృద్దులను నెమ్మదిగా ఎన్నికలకు దూరం పెట్టే దిశగా బీజేపీ వెళ్తోంది. ఇప్పటికే గాంధీనగర్ నియోజకవర్గంలో ఎల్ కే అద్వానీ బదులు అమిత్ షాకు టికెట్ ఇచ్చారు. తర్వాత నైనిటాల్ లో భగత్ సింగ్ కొష్యారీ (76), ఉత్తరాఖండ్ లోని పౌరిలో బీసీ ఖండూరీ (85), హిమాచల్ ప్రదేశ్ లో శాంత కుమార్ (84)లనూ పక్కన పెట్టారు. వీరిలో శాంత కుమార్ మాత్రం తాను పోటీ చేయనని ముందే చెప్పారు. కాన్పూర్ నియోజకవర్గం నుంచి మురళీ మనోహర్ జోషికి కూడా ఈసారి అవకాశం ఉండేలా లేదు. అలాగే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ (76)కు ఈసారి టికెట్ దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. అక్కడ అందరూ ఆమెను ప్రేమగా ‘పెద్దమ్మ’ అని పిలుచుకుంటారు. 1989 నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ చంద్ర షెటి్టని లక్ష ఓట్ల తేడాతో ఓడించారు.
సుమిత్రకు టికెట్ ఇవ్వకూడదని మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు సత్యనారాయణన్ (79) వాదిస్తున్నారు. తొమ్మిదో సారి కూడా ఆమెకు టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయిస్తే తాను స్వతంత్ర సభ్యుడిగా ఆమెపై పోటీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇండోర్ నగరానికి ఆమె ఏమీ చేయలేదని, పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉందని సత్యనారాయణన్ అంటున్నారు. సత్తన్ కూడా జనసంఘ్ రోజుల నుంచి ఉన్నారని, ఆయన పార్టీ అభ్యర్థికి మద్దతు చెబుతారనే అనుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమేశ్ శర్మ అన్నారు.
ఝార్ఖండ్ లో బీజేపీ సీనియర్ నేత కరియా ముండా (84)కు ఈసారి విశ్రాంతి ఇచ్చేలాగే ఉన్నారు. ఖుంతి నియోజకవర్గంలో ఈసారి మాజీ సీఎం అర్జున్ ముండాకు అవకాశం దొరికేలా ఉంది. బిహార్ లో హుకుందేవ్ నారాయణ్ సింగ్ (79) రిటైర్ అవ్వాలనుకుంటున్నానని ఆయనే చెప్పారు. దాంతో ఆయన కొడుకు అశోక్ యాదవ్ పేరును మధుబని అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. యూపీకి చెందిన కల్రాజ్ మిశ్రా కూడా 75 దాటినవారే. ఆయన సైతం ఈసారి పోటీచేయడం లేదు. 60 ఏళ్ల వయసులోనే ఉన్నా కూడా.. అనారోగ్యం కారణంగా తాము పోటీ చేయబోమని ఇద్దరు కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, ఉమాభారతి చెప్పారు.