అమరావతి: ఎన్నికల ముందు కేంద్రంలో బిజెపితో తెగతెంపులు చేసుకున్నదానిపై ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన దుంప తెంచుతున్నాయి. తిరిగి తమ పార్టీతో పొత్తుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆ మాటల ఆధారంగా బిజెపి నాయకులు చంద్రబాబును ఇరకాటంలో పెడుతున్నారు. తాజాగా ఆ నాయకుల జాబితాలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేరారు.
చంద్రబాబు పరిస్థితి చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బిజెపి కార్యాలయాన్ని బుధవారం రాంమాధవ్ ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు తన పార్టీ నుండి వలసలను ఆపేందుకు బిజెపితో పొత్తు గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని రాంమాధవ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామనీ, రాష్ట్రంలో ఏ పార్టీకి జూనియర్ పార్టీగా వ్యవహరించబోమనీ రాంమాధవ్ తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రాంమాధవ్ అన్నారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు అందేలా చూస్తామని రాంమాధవ్ పేర్కొన్నారు.