(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హుజూర్ నగర్ ఉపఎన్నికలో భారీ విజయం సాధించిన అధికార టీఆర్ఎస్.. ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు నెలలుగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొనగా ఇటీవల హైకోర్టు పచ్చజెండా ఊపడంతో మార్గం సుగమమైంది. పదవీ కాలం ముగిసిన పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నవంబరు ఆఖరులోపే మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ పేర్కొనడంతో.. రాజకీయపార్టీల్లో ఆశావాహుల్లో సందడి నెలకొంది. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే అగ్ర నాయకత్వం సంకేతాలిచ్చింది. మున్సిపాలిటీల్లో పైచేయి సాధించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అంతర్గత సమావేశాలతో ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పలు ధపాలుగా కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించింది. అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఆశావాహులు పార్టీ టిక్కెట్ల వేటలో పడ్డారు.
మున్సిపాలిటీలు, మున్సిపల్కార్పొరేషన్ల పరిధిలో నేతల ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. టీఆర్ఎస్ అధిష్టానం అన్ని జిల్లాలపై ఫోకస్ పెట్టింది. అన్ని స్థానాలను చేజిక్కించుకునేందుకు ఆపార్టీ కసరత్తు చేస్తోంది. విపక్షాలకు తావివ్వకుండా అన్ని మున్సిపాలిటీల్లో సత్తా చాటాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లక్ష్యాన్ని నిర్దేశించారు. గెలుపోటముల పూర్తి బాధ్యతను స్థానిక నేతలపై ఉంచేందుకు పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తుంది. దీంతో స్థానిక నేతలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారనున్నాయి. ఇటీవలి కాలంలో ఏ ఉప ఎన్నిక వచ్చినా అందులో టీఆర్ఎస్ మాత్రమే గెలుస్తూ వస్తున్నది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలాబీ జెండా రెపరెపలాడుతుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. హుజూర్ నగర్ ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ప్రభావం చూపలేదు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం ఏకపక్షమేనని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నవంబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని మరోసారి సరిచూసుకోవాలని, మున్సిపోల్స్ నిర్వహణకు సన్నద్ధమై ఉండాలని రాష్ట్రఎన్నికల సంఘం.. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించింది. మునిసిపల్ ఎన్నికలకు ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తున్నది. ఇప్పటికే వార్డుల విభజన, జనగణన ఆధారంగా ఓటర్ జాబితాలను విడుదల చేసింది. రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. మీర్పేట కార్పొరేషన్లో వార్డుల విభజన జరుగని కారణంగా అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇటీవలే అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లకు ఎడమచేతి మధ్య వేలిపై సిరా చుక్కా వేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తున్నది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కలిపి 79,92,434 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించింది. మొత్తం 3,103 వార్డుల్లో 9,056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతి 800 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. న్యాయస్థానం ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎస్ఈసీ నాగిరెడ్డి సూచించారు.