టాప్ స్టోరీస్మళ్ళీ మోదీ కోసం by Siva PrasadJanuary 11, 2019 ఢిల్లీ, జనవరి 11: కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నేతలు సమాయుత్తం అవుతున్నారు. శుక్ర, శనివారాల్లో ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో పార్టీ జాతీయ స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సిలు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు సుమారు 12వేల మంది పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో చర్చ ప్రధానంగా మోదీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ఎలా అన్న దానిపై కేంద్రీకృతం కానున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభ ఉపన్యాసంతో సభ ప్రారంభమై రెండవ రోజు ప్రధాని ప్రసంగంతో ముగియనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ నేతృత్వంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైన సభలో చర్చించనున్నారు. ప్రధానంగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు నేతలకు అధినాయకత్వం దిశానిర్ధేశం చేయనుంది. దేశ వ్యాప్తంగా పార్టీకి 1.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. శిక్షణ పొందిన కార్యకర్తల ద్వారా ఎన్నికల్లోగా ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ప్రచారం చేయాలని పార్టీ సంకల్పం.2014 జనవరి 18,19 తేదీల్లో బిజెపి ఇదే వేదికపై పార్టీ జాతీయ సమావేశాలను నిర్వహించింది.