(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఓ మహిళకు చెందిన 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ ఎద్దు తినేసింది. ఈ ఘటన హర్యానాలోని సిర్సా జిల్లాలో కలన్వాలీలో చోటుచేసుకుంది. జనక్ రాజ్ అనే వ్యక్తి భార్య, కోడలు తమ వంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు నగలను తీసి, వంట గదిలోని ఓ గిన్నెలో భద్రపరిచారు. అనంతరం అదే గిన్నెలో చెత్తను పడేశారు. తర్వాతి రోజు ఉదయం ఆ విషయం మరిచిపోయి ఆ కూరగాయలను బయటకు విసిరారు. కొన్ని గంటల తర్వాత వారికి బంగారు ఆభరణాలు గుర్తుకొచ్చాయి. వాటిని ఎక్కడ పెట్టామా ? అని వెతకడం ప్రారంభించారు. చివరికి అవి కూరగాయల బుట్టలో పెట్టామని తెలుసుకుని కంగారు పడ్డారు. బయటకు వెళ్లి చూసేసరికి కూరగాయలు లేవు, ఆభరణాలు లేవు. ఆ నగలు ఎవరు తీశారో తెలుసుకోవడం కోసం సీసీటీవీ కెమెరాలో రికార్డైన వీడియోను చూశారు.
వారు పాడేసిన కూరగాయలను ఓ ఎద్దు తినడం గుర్తించారు. దీంతో ఆ ఎద్దును వెతికి మరీ ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం దాన్ని గుమ్మంలో కట్టేసి గడ్డి, చెరకు పిప్పి పెట్టారు. అది పేడ వేయగానే దాన్ని జల్లెడ పట్టి మరీ నగలు కోసం వెతుకుతున్నారు. కడుపులో తిప్పుతున్నా సరే.. ఆ పేడను అణువణువూ తనిఖీ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీన ఈ ఘటన జరగగా.. ఇప్పటి వరకు పేడలో ఒక్క నగ బయటకు రాలేదు. దీంతో వారు నిరాశ చెందుతున్నారు. కానీ, ఎద్దుకు మాత్రం మంచి ఆహారం దొరుకుతోంది. జనక్ రాజ్ కుటుంబం పశువుల వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఎద్దు పేడ నుంచి బంగారం రాకపోతే తాము గోషాల వద్ద వదిలేస్తామని జనక్ రాజ్ చెప్పారు.