అమరావతి: అక్రమాస్తుల కేసులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలంటే… సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని సీబీఐ స్పెషల్ కోర్టు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేసింది. నిందితుల హోదా మారినంత మాత్రాన కేసుల తీవ్రత తగ్గినట్లు కాదని కోర్టు పేర్కొంది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పెట్టుకున్న పిటిషన్ ను కొట్టివేస్తూ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రతి సోమవారం బయటకు వచ్చింది. 2013లో జగన్ వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను సీబీఐ కోర్టు తన ఆదేశాలలో తెలిపింది. ‘ఆర్థిక నేరాల వెనుక పెద్ద కుట్ర ఉంటుంది. వీటివల్ల పెద్ద ఎత్తున ప్రజాధనం నష్టపోవాల్సి వస్తేంది. ఇలాంటి నేరాల వల్ల దేశ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది ’అని సుప్రీంకోర్టు పేర్కొందని కోర్టు గుర్తు చేసింది.
జగన్ తరపున న్యాయవాది హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను గతంలో కోట్టివేశామని ఈ ఆదేశాల్ని హైకోర్టు కూడా సమర్థించిందని పేర్కొంది. అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్న జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం ఆర్టికల్ 14కు విరుద్ధమని తెలిపింది. సీఎం పదవిలో ఉన్న జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్షులు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది సురేందర్ రావు వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కావాలంటే ఈవిషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలంటూ సలహా కూడా ఇచ్చింది. అయితే, సీబీఐ కోర్టు ఇచ్చిన సలహా మేరకు సీఎం జగన్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ, జగన్ తరపు లాయర్లు తమ వాదనలు వినిపించగా.. కోర్టు తీర్పును నవంబర్ 1కి రిజర్వ్ చేసింది. జగన్ తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ.. జగన్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ప్రతి శుక్రవారం హైదరాబాద్ కోర్టుకు రావాలంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడంతో పాటూ విధి నిర్వహణలో చాలా ఇబ్బందులు కలుగుతాయని లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే తాము వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. గతంలో సుప్రీం, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కోర్టుకు గుర్తు చేశారు. అయితే, సీబీఐ.. జగన్ పిటిషన్పై గట్టిగా వాదనలు వినిపించింది. ఈ కేసులో పరిస్థితులు మారాయని, నేరంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. జగన్ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయాలని ప్రయత్నించారని.. జగన్ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని.. మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని ఆరోపించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు.. జగన్ పిటిషన్ను డిస్మిస్ చేసింది.